Shree Charani-Lokesh: వన్డే ప్రపంచ కప్ గెలిచి భారత మహిళల క్రికెట్ జట్టు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలిచి చారిత్రాత్మక రికార్డు నమోదు చేసింది మహిళా జట్టు. ఈ కప్పు సాధించడంలో యువ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీచరణి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాలు కురిపించింది. శ్రీ చరణి కి రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందించింది. అలాగే ఘనంగా సత్కరించింది.
Also Read: Ind W vs SL W: విశాఖలో పొగమంచు… టీమిండియా విమానం డైవర్ట్ !
మహిళల వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళ క్రికెటర్ శ్రీచరణి కి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందజేసింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో క్రికెటర్ శ్రీ చరణిని కలిసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు చెక్ ని అందించారు. కడప జిల్లాకు చెందిన శ్రీ చరణీ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తోంది. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. రూ.2.5 కోట్ల మేర నగదు ప్రోత్సాహంతో పాటు విశాఖలో 500 గజాల విస్తీర్ణం గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. డిగ్రీ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ వన్ హోదా ఉద్యోగాన్ని కల్పించనుంది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, షాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, క్రీడా శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, శాప్ ఎండి భరణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ డి. శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ బి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తన తొలి ప్రపంచకప్ లోనే శ్రీ చరణి అత్యంత కీలకపాత్ర పోషించింది. ఈ ప్రపంచకప్ లో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన శ్రీచరణి.. 78 ఓవర్లు వేసి 14 వికెట్లు పడగొట్టింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఒక్కసారిగా టాప్ బౌలర్లలో స్థానం సంపాదించుకుంది. నవి ముంబైలో జరిగిన ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాను ఓడించి భారత్ ఈ ట్రోఫీని సాధించింది. ఈ విజయం 140 కోట్ల మంది భారతీయులలో నూతన ఉత్సాహాన్ని నింపింది.
Also Read: Sarfaraz Khan: CSKలోకి ఎంట్రీ.. హీరో నాని సీన్ రిపీట్.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్
ఏపీలోని కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన శ్రీ చరణి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. చిన్నతనం నుండే బాడ్మింటన్, కబడ్డీ వంటి క్రీడలలో ప్రతిభ చూపించిన శ్రీ చరణి.. 16 సంవత్సరాల వయసులో క్రికెట్ లో అడుగుపెట్టింది. తన మామయ్య కిషోర్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదట ఫాస్ట్ బౌలర్ గా శిక్షణ తీసుకున్న శ్రీ చరణి.. ఆ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా మారింది.