Engineering Student Suicide: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్లో విద్యార్థిని తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నానని రాసుకొచ్చింది. తన చదువు, కుటుంబంపై ఆర్థిక భారం నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు అందులో రాసుకొచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఇంకా డీటేల్స్ లోకి వెళ్తే..
ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్
ఛత్తీస్గఢ్లోని ఓ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి పేరు ప్రిన్సీ కుమారిగా గుర్తించారు. ఆమె వయస్సు 20 ఏళ్లు. ఆమె సొంతూరు జార్ఖండ్లోని జంషెడ్పూర్ నివాసి. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలియగానే హాస్టల్ సిబ్బంది.. అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అమ్మ-నాన్న నన్ను క్షమించండి అంటూ లేఖ
ప్రాథమిక సమాచారం మేరకు విద్యార్థిని సెకండ్ ఇయర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. దీనికితోడు ఫస్టియర్ ఐదు పేపర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈ నెలలో మూడు పరీక్షలకు హాజరైంది. ఈ వారం మరో రెండు పరీక్షలకు హాజరుకావాల్సివుంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైందని తెలుస్తోంది. పోలీసులు గది నుండి ఓ సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు.
అమ్మ, నాన్న.. మీ అంచనాలను అందుకోలేకపోతున్నానని, తనను క్షమించాలని అందులో రాసి ఉంది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని యువతి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మృతికి ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు పోలీసులు. హాస్టల్ విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు.
ఫ్యామిలీసభ్యులు శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ప్రిన్సీకు పదే పదే కాల్ చేశారు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏదో జరుగుతుందని భావించారు కుటుంబసభ్యులు. వెంటనే హాస్టల్ వార్డెన్కు ఫోన్ చేశారు. వార్డెన్ గదికి చేరుకున్నాడు. గది తలుపు లోపలి నుండి లాక్ చేసి ఉంది.
ALSO READ: వ్యాపారవేత్త హత్య కేసు.. రంగంలోకి సీబీఐ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు కొడుకు, కూతురు అరెస్ట్
పదే పదే తలుపు తట్టినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. కిటికీ నుంచి వార్డెన్ చూడగా విద్యార్థిని ఉరి వేసుకుని కనిపించింది. సూసైడ్ నోట్లో తన చదువు వల్ల కుటుంబంపై ఆర్థికభారం పడిందని రాసింది. కష్టపడి దాచుకున్న పొదుపు మొత్తాన్ని తన చదువు కోసం ఉపయోగించారని, తాను అంచనాలకు మించి అందుకోలేపోయినట్టు పేర్కొంది.
ఇటీవల సెమిస్టర్ ఫీజుల కోసం వాయిదాల రూపంలో దాదాపు లక్ష రూపాయలు అడిగినట్టు పేరెంట్స్ తెలిపారు. కూతుర్ని ఆ విధంగా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.