Fake IPS Nagaraju: హైదరాబాద్ లో నకిలీ పోలీసుల ముఠా మరోసారి కలకలం రేపింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ సంస్థ ఎండీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి సుమారు నెల రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసిన వైనం వెలుగులోకి వచ్చింది. గతంలో నకిలీ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతూ అరెస్టయిన నాగరాజు అలియాస్ కార్తీక్ ఈ కిడ్నాప్ డ్రామాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. సినిమా ఫక్కీలో సాగిన ఈ హైడ్రామాలో నిందితులు ఏకంగా పోలీసు వాహనం యూనిఫామ్ లాఠీలు హ్యాండ్ కప్స్ వాడుతూ బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు.
కూకట్పల్లికి చెందిన రామచందర్ రాజు శ్రీనివాస సివిల్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ’ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇదే సంస్థలో గతంలో కాంట్రాక్ట్ పనులు చేసిన అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు శివరామరాజులతో రామచందర్ రాజుకు ఆర్థిక పరమైన విభేదాలు తలెత్తాయి. గతంలోనే వీరి మధ్య సెటిల్మెంట్ జరిగినప్పటికీ రామచందర్ రాజు నుంచి మరో ఏడు కోట్ల రూపాయలు వసూలు చేయాలని ప్రత్యర్థులు ప్లాన్ వేశారు. ఈ క్రమంలో వారు నేర చరిత్ర ఉన్న నాగరాజును సంప్రదించి కిడ్నాప్ ప్లాన్ను అమలు చేశారు.
జనవరి 9వ తేదీన మొదట సదరు సంస్థ ఫైనాన్స్ మేనేజర్ ప్రకాష్ను నిందితులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఎండీ రామచందర్ రాజు ఆయన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఏపీలోని ధవలేశ్వరం హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ ఫామ్ హౌస్లకు తరలించి నెల రోజుల పాటు బంధించారు. ప్రాణ భయంతో ఉన్న బాధితుల నుంచి నిందితులు ఇప్పటికే 20 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇంకా నాలుగు కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడటంతో బాధితులు ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులు పోలీసుల వేషధారణలో ఉండటం వల్ల బాధితులు మొదట అది నిజమైన పోలీసు విచారణ అని నమ్మారు. నాగరాజు మరో ముగ్గురితో కలిసి ఒక నకిలీ పోలీస్ టీమ్ను సిద్ధం చేసుకుని ఈ దందా సాగించారు. ప్రస్తుతం శివరామరాజుతో పాటు నకిలీ పోలీసు జానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ కేసులో నిందితుల క్రూరత్వం చూసి పోలీసులు సైతం విస్మయం చెందుతున్నారు. బాధితులను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడిన ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నకిలీ పోలీసుల ముఠా వద్ద ఉన్న వాహనం పోలీస్ యూనిఫామ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. నగరంలో ఇటువంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: Drug Reels Controversy: శివుడికి ప్రసాదంగా గంజాయి పెట్టారు.. ఆ తరువాత ఏమైందంటే..