Road Accident: కేరళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు అయ్యప్ప స్వాములు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరో సచివాలయ ఉద్యోగి పరిస్థితి విషమంగా ఉంది. మృతిచెందిన వారిని పైడి సాయి కుమార్, నవీన్ కుమార్ గా గుర్తించారు. వీరు శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణానికి చెందినవారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రాజుగా గుర్తించారు. ఆయన సచివాలయ ఉద్యోగి. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ నుంచి అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు వెళ్లిన భక్తుల బృందంలో ఉన్నారు. ఈ నెల 23న మొత్తం ఆరుగురు అయ్యప్ప స్వాములు శబరిమలకు బయలుదేరారు. శబరిమల దర్శనం పూర్తయ్యాక.. రామేశ్వరం వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరి ప్రయాణిస్తున్న వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో సాయి కుమార్, నవీన్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలైన రాజును చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
ఈ వార్త తెలియగానే పలాస పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రెండు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాల సహాయ సహకారాల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.