Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగెపల్లి గ్రామంలో నూతన సంవత్సర వేళ వర్ణించలేని విషాదం చోటుచేసుకుంది. అందరూ కొత్త ఏడాది వేడుకల్లో ఉంటే.. ఆ కుటుంబంలో మాత్రం కాలం నిలిచిపోయింది. కొడుకు మరణించిన గంట వ్యవధిలోనే తండ్రి కూడా ప్రాణాలు వదలడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
నాగెపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం, ఆయన కుమారుడు శ్రీకాంత్ ఇద్దరూ నిత్యం శ్రమిస్తూ జీవనం సాగించేవారు. జనవరి 1వ తేదీన తెల్లవారుజామున శ్రీకాంత్కు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు తేరుకునేలోపే శ్రీకాంత్ కన్నుమూశాడు. కళ్ల ముందే కండలు తిరిగిన కొడుకు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తండ్రి రాజేశం తట్టుకోలేకపోయారు.
ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు మరణాన్ని రాజేశం జీర్ణించుకోలేకపోయారు. గుండె పగిలేలా రోదిస్తూ.. తీవ్రమైన ఒత్తిడికి లోనైన ఆయన.. కొడుకు చనిపోయిన కేవలం గంట వ్యవధిలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఒకే ఇంట్లో గంటల వ్యవధిలో తండ్రీకొడుకులు ఇద్దరూ మరణించడంతో ఆ ప్రాంతమంతా కన్నీటి సముద్రమైంది.
ఈ ఘటన చూస్తుంటే విధి ఎంత బలీయమైనదో అర్థమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం కూడా రాజేశం కుటుంబంలో ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. అప్పట్లో రాజేశం తల్లిదండ్రులు కూడా ఒకే రోజు మరణించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు రాజేశం, ఆయన కుమారుడు కూడా ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడం యాదృచ్ఛికమే అయినా.. ఆ కుటుంబానికి ఇది తీరని లోటు.
ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు, అది కూడా పండుగ రోజున మరణించడంతో నాగెపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేస్తున్నాయి.
ALSO READ: Jagga Reddy: ఇది కదా మానవత్వం అంటే… పేద కుటుంబానికి RS.10 లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి