Chevella Accident: పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. చేవెళ్ల మండలంలోని బీజాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న దామరగిద్ద పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ, బ్రీజా కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.
పూడూర్ మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన పట్టెల్ ప్రవీణ్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం బ్రీజా కారులో చేవెళ్లకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దామరగిద్ద వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీ కొట్టడంతో.. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రవీణ్కు వచ్చే మార్చి 5వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనుల్లో భాగంగానే ఆయన చేవెళ్లకు వస్తుండగా ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. శుభకార్యం జరగాల్సిన సమయంలో వరుడు ప్రమాదానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రస్తుతం ప్రవీణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: మత్తు మాఫియా మైండ్ గేమ్.. స్కూల్ బ్యాగుల్లో రూ.1.43 కోట్ల గంజాయి