Crime News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కమ్మర్పల్లి గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భార్య దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేక, ఆమె అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే భర్త కూడా ప్రాణాలు విడిచారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
వివరాల్లోకి వెళ్తే.. కమ్మర్పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్ (32)కు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గురిజాల గ్రామానికి చెందిన సువర్ణ (29)తో 2020లో వివాహం జరిగింది. అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల జీవితంలో అనారోగ్యం చిచ్చురేపింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సువర్ణను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు.
భార్య పార్థివ దేహానికి శుక్రవారం కమ్మర్పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. తన కళ్ల ముందే భార్య చితి మంటల్లో కాలిపోవడం చూసి వినోద్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. స్మశానం నుండి ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే దహెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం బెల్లంపల్లికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
Also Read: దేశంలో ఘోరం.. నగ్న వీడియోలతో బెదిరించి.. విద్యార్థినిపై 4 కార్లలో అత్యాచారం
కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. పట్టుమని ఐదేళ్లు కూడా నిండని వీరి కాపురం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం కమ్మర్పల్లి గ్రామస్తులను కన్నీటిపర్యంతం చేసింది. మరణంలోనూ వీరు విడిపోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.