Gujarat Horror: టెక్నాలజీ యుగంలో ట్రెండ్ మారుతూ ఉంటుంది. మనుషులు కూడా అదే విధంగా మారిపోతున్నారు. నచ్చకపోతే భార్యని అమ్మేసే రోజులు వచ్చేశాయి. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదూ. అలాంటి ఘటన గుజరాత్లో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? ఎందుకు భార్యని అమ్మేందుకు డిసైడ్ అయ్యాడు?
గుజరాత్ లో దారుణమైన ఘటన.. భార్యని అమ్మేసిన భర్త
గుజరాత్లో అత్యంత దారుణ ఘటన బయటపడింది. భార్య నచ్చలేదనే ఒకే ఒక్క కారణంతో కట్టుకున్న భర్త రూ.50 వేలకు అమ్మేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మహిళ భర్త నిఖేష్భాయ్ పటేల్తో పాటు మొత్తం ఏడుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలనం రేపిన ఈ ఘటన బనస్కాంత జిల్లాలో బయటపడింది.
పోలీసులు చెబుతున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మే 11న నిఖేష్ పటేల్ తన తన 26 ఏళ్ల భార్య కనిపించడం లేదంటూ పాలన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత నిఖేష్ అదృశ్యం అయ్యాడు. దీంతో నిఖేష్ తండ్రి పోలీసులకు మరొక ఫిర్యాదు చేశాడు. కొడుకు-కోడల గురించి ఇంట్లోవారు ఫిర్యాదు చేయడంతో పోలీసులకు ఎక్కడో చిన్న అనుమానం మొదలైంది.
తీగలాగితే డొంక కదిలింది, బాదితురాల్ని రక్షించిన పోలీసులు
ఈ వ్యవహారం కాస్త జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వెళ్లింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. డిజిటల్ ఆధారాలు, వ్యక్తుల సమాచారం ఆధారంగా వివరాలు సేకరించారు పోలీసులు. చివరకు భర్త నిఖేష్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో అసలు గుట్టు బయటపడింది.
విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించాడు నిఖేష్. తన భార్య ప్రవర్తన నచ్చక పోవడంతో ఆమెని వదిలించుకోవాలని డిసైడ్ అయినట్టు చెప్పాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ సంజయ్ ఠాకూర్, అశోక్ ఠాకూర్, సచిన్ దర్బార్ల సహాయంతో భార్యని 50 వేల రూపాయలకు అమ్మినట్టు నిజాలు బయటపెట్టాడు. దీంతో బాధిత మహిళ ఎక్కడ ఉందన్న దానిపై ఆరా తీశారు.
ALSO READ: సిట్ కస్టడీకి బండి భగీరథ్.. ఫార్మ్ హౌస్లో సీన్ రీ-కన్ స్ట్రక్షన్.. ఈ ప్రశ్నలపై ఆరా..!
చివరకు బాధితురాలిని సురక్షితంగా కాపాడారు పోలీసులు. తనను అమ్మిన తర్వాత కొందరు వ్యక్తులు ఒకచోట బంధించినట్టు తెలిపింది బాధితులురాలు. తనపై నిరంతరం లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొంది. తన వద్దనున్న బంగారం వస్తువులు లాక్కొని అమ్మేశారంటూ కన్నీరు మున్నీరు అయ్యింది బాధితురాలు.
ఈ యవ్వారంపై పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్, మోసం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అన్నట్లు భర్త నిఖేష్ పటేల్కు భార్యని ఎందుకు అమ్మినట్టు? అన్నది అసలు ప్రశ్న. నిఖేష్ పటేల్కు ఇప్పటికే వివాహం జరిగింది. ఇతర మహిళలను లోబరుచుకోవడం, కిడ్నాప్ వంటి నేర చరిత్ర అతడికి ఉందని గుర్తించారు. గతంలో ఈ విధంగా ఎవర్నైనా అమ్మేశాడా? అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.