Bandi Bhageerath Case: పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ను సిట్ అధికారులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. మొయినాబాద్ లోని అరణ్య ఫార్మ్ హౌస్ కు తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. మైనర్ అయిన తన కూతురిపై బండి భగీరథ్ లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ ఇటీవల ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు అతనిపై పోక్సో యాక్ట్ లోని వేర్వేరు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం రాజకీయంగా పెను దుమారాన్ని సృష్టించింది. దాంతో పారదర్శకమైన దర్యాప్తు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు సిట్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం కూకట్ పల్లి జోన్ డీసీపీ రితి రాజ్ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. కాగా, కేసు నమోదు కాగానే బండి భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాంతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు.. తొమ్మిది రోజుల తరువాత బండి భగీరథ్ ను నార్సింగి సమీపంలోని తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద అరెస్ట్ చేశారు. అనంతరం మేడ్చల్ కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు రిమాండ్ చేశారు. కాగా, కేసుకు సంబంధించి పలు కీలకమైన వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో బండి భగీరథ్ ను వారం రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ సిట్ అధికారులు మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బండి భగీరథ్ తన ఐఫోన్ ను అప్పగించాడని తెలిపారు.
అయితే, దీనికి ముందు పలుమార్లు ఫోన్ ను ఫార్మాట్ చేసి అందులో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేశాడని పేర్కొన్నారు. క్లౌడ్ నుంచి డేటాను రిట్రీవ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియచేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన మేడ్చల్ కోర్టు బండి భగీరథ్ ను మూడు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం చర్లపల్లి జైలుకు వెళ్లిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం తరువాత మొయినాబాద్ లోని అరణ్య ఫార్మ్ హౌస్ తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి తన కూతురిని బండి భగీరథ్ ఇదే ఫార్మ్ హౌస్ కు తీసుకెళ్లి లైంగిక దాడి జరిపినట్టు బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ రోజు బండి భగీరథ్ బాధితురాలితో ఏ గదిలో ఉన్నాడు? వారి వెంట ఎంతమంది స్నేహితులు ఉన్నారు? అన్న వివరాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఇప్పటికే ఫార్మ్ హౌస్ లోని సీసీ కెమెరాల ఫుటేజీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫుటేజీని చూపించి బండి భగీరథ్ ను ప్రశ్నించినట్టుగా తెలిసింది.
Also Read: ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఈ క్రేజీ టిప్స్ మీకోసమే.. బోలెడంత డబ్బు ఆదా చేయెుచ్చు!
గురువారం నుంచి సిట్ అధికారులు బండి భగీరథ్ ను పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు ఎవరి ద్వారా పరిచయం అయ్యింది? ఎన్నిసార్లు కలుసుకున్నారు? కలిసి ఎన్నిసార్లు పార్టీలు, ఫంక్షన్లకు హాజరయ్యారు? అన్న సమాచారాన్ని సేకరించనున్నారు. దాంతోపాటు బాధితురాలిని కలిసిన ప్రతీసారి బండి భగీరథ్ వెంట ఎవరెవరు ఉన్నారు? అన్న వివరాలను కూడా తెలుసుకోనున్నారు. పలుమార్లు తన కూతురితోపాటు కుటుంబ సభ్యులను బండి భగీరథ్ బెదిరించినట్టుగా బాధితురాలి తల్లి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో దీనిపై కూడా అతన్ని ప్రశ్నించనున్నారు. బాధితురాలి తల్లి అందించిన చాటింగ్ మెసెజీలు, స్క్రీన్ షాట్లను ఎదురుగా పెట్టి బండి భగీరథ్ ను విచారించనున్నట్టు సమాచారం. దీని కోసం ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: విమాన ప్రయాణికులకు షాక్.. జూన్ 1 నుంచి భారీగా తగ్గనున్న.. Air India, Indigo సర్వీసులు!