Photo Morphing: స్వేచ్చ బ్యూరో: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల ఫొటోలను మార్ఫింగ్ చేసిన ఘటన వెలుగు చూసి కలకలం రేపింది. ఈ ఘటనలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న మహేష్ అనే ఆర్టిజన్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎర్రబెల్లికి చెందిన మహేష్ గత తొమ్మిదేళ్లుగా హుస్నాబాద్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
అందరితో స్నేహంగా ఉంటూనే, కార్యాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులు, ఇతర మహిళల ఫొటోలను రహస్యంగా సేకరించి వాటిని అశ్లీల చిత్రాలతో మార్ఫింగ్ చేస్తున్నట్లు వెల్లడైంది. గత నాలుగేళ్లుగా ఈ వికృత చర్యలకు పాల్పడుతున్న మహేష్ వ్యవహారం అతని అజాగ్రత్త కారణంగా బయటపడింది. ఆఫీస్ కంప్యూటర్లో తన వాట్సాప్ వెబ్ లాగిన్ను అలాగే వదిలేయడంతో, అందులో ఉన్న మార్ఫింగ్ ఫొటోలను గమనించిన తోటి సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని డి ఈ కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లడంతో పాటు షీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also read: క్షణికావేశం.. నిండు ప్రాణం బలి.. ఫోన్ చూడొద్దన్నందుకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య!
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కార్యాలయానికి చేరుకుని మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వ్యక్తిగత ల్యాప్టాప్, ఆఫీస్ కంప్యూటర్తో పాటు ఇంట్లోని ఇతర సిస్టమ్లను సీజ్ చేశారు. పరిశీలనలో కొన్ని వందల సంఖ్యలో మార్ఫింగ్ ఫొటోలు, అశ్లీల వీడియోలు లభ్యమైనట్లు సమాచారం. నిందితుడిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హుస్నాబాద్ ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడా..? ఇతరులకు విక్రయించాడా..? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Also read: అమెరికాలో ఘోర ప్రమాదం.. స్విమ్మింగ్ పూల్లో మునిగి తెలుగు యువతి దుర్మరణం