దృశ్యం సినిమాను మరిపించేలా ఓ క్రైమ్ సంఘటన .. ఏపీ రాజకీయాలను అట్టుడుకేలా చేస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో సస్పెన్స్తో కూడిన దృశ్యం సినిమా అందరినీ ఆకట్టుకున్నది. ఇక్కడ అంతకు మించి సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ సినిమాలో హీరో తన పిల్లలను కాపాడుకునే క్రమంలో చేసిన హత్య… ఉదంతం బయటపడకుండా పోలీసులను ముప్పు తిప్పలు పెడితే.. ఇక్కడ విలనే పోలీస్. అదే సీఐ నాగరాజు. నిందితుడే బాధితుడు గాదె సాయికృష్ణ.
ఇప్పుడు అతడే అదృశ్యమైంది. ఎవరికీ అంతుచిక్కని ఈ కేసు… ఎన్నో మలుపులు తిరుగుతున్నది. దృశ్యం సినిమాను మించి ఉత్కంఠను రేపుతోంది. క్రైమ్ థ్రిల్లర్ను మించి క్షణక్షణం మలుపులు తిరుగుతున్నది. ఇక్కడ పోలీసు శాఖే ప్రధాన విలన్గా మారి ఏపీ సర్కార్ను బద్నాం చేస్తున్నది. ఒక్క ఖాకీ చేసిన నిర్వాకం.. యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా చేసింది.
దృశ్యం సినిమాలో హీరో నోరు విప్పడు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కావాల్సిన ఆధారాలన్నీ సమకూర్చుకుని బయటపడటం కోసం ఆ కథను అల్లుకున్నారు. అక్కడ హీరో చేసిన తప్పిదాన్ని మానవీయ కోణంలో చూశారు జనం. అందుకే అతడు పోలీసులను బురిడీ కొట్టిస్తున్నా.. దాన్ని ఎంజాయ్ చేశారు.
ఇక్కడ పోలీసే విలన్. ఆ విలన్ నాగరాజు ఇప్పుడు సిట్ ఆధీనంలో ఉన్నాడు. నోరు విప్పక తప్పని పరిస్థితి. నోరు విప్పితేనే అసలు సంగతి తెలిసేది. గాదె సాయికృష్ణను ఏం చేశారో నాగరాజుకు తప్ప మరెవరికీ తెలియదు. అంతలా సస్పెన్స్ను కొనసాగిస్తున్నాడు ఆ సీఐ. ఈ కేసు వల్ల సర్కార్కు చెడ్డ పేరు వస్తుందని తెలిసినా.. చంద్రబాబు కూడా ఏమీ చేయలేక పోయారు.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా సీఐను సస్పెండ్ చేయడం.. సిట్ విచారణ ఇప్పుడు చేస్తున్నారు. కాపు కులాన్ని కూడా ఈ కేసుకు ఆపాదించి పవన్ కళ్యాణ్ను కూడా ఇందులో లాగారు. పవన్ ఈ విషయంలో కొంత కంట్రోల్ తప్పడం కూడా సర్కార్ను ఇరుకున పెట్టింది. వైఎస్సార్ సీపీ నేతలు, జగన్ కలిసి.. బాబును, పవన్ను టార్గెట్ చేసి ఈ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారు. నేరస్తుడు, బాధితుడు గాదె సాయి కృష్ణ కాపు కులస్తుడైనా, అతన్ని చంపేసినా పవన్ పట్టించుకోలేదని ఆ పార్టీ ప్రచారం చేసింది.
దీనిపై పవన్ ఆవేశంగా స్పందించాడు. నేరస్తులకు కులాలుండవని, తనకు కులాన్ని ఆపాదించవద్దన్నాడు. అంటే.. ఓ రకంగా అతడు నేరస్తుడు కాబట్టి.. పోలీసుల చేతిలో చచ్చి ఉంటాడనే విధంగా పవన్ వ్యాఖ్యల పరమార్థంగా భావించాల్సి వస్తుంది. సాయికృష్ణను పోలీసులే చంపారని ఇండైరెక్టుగా పవన్ క్లియర్గా చెప్పినట్టు అయ్యింది.
అంతా తెలిసినా గవర్నమెంట్.. ఆ సీఐ ద్వారా అసలు వాస్తవాలు చెప్పించి.. దాన్ని క్లోజ్ చేసే ప్రయత్న చేయలేదు. లాకప్డెత్ మచ్చ ప్రభుత్వానికి పడవద్దని భావించి ఉంటుంది. కానీ అంతకు మంచిన డ్యామేజీ అవుతూ వస్తోంది రోజు రోజుకు. స్మశాన వాటికలో పోలీసులు ఓ రెండు అనాథ శవాలను కాష్టం చేసినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. కానీ వాస్తవాలే బయటకు రావడం లేదు.
ఏం జరిగిందో అందరికీ అర్థమవుతున్నట్టే ఉంది. కానీ ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఓ నేరస్తుడిని కోర్టుకు సమర్పించాల్సి ఉన్న కేసులో.. పోలీసు మార్కు థర్డ్ డిగ్రీ చేసే క్రమంలోనే సీఐ చేసిన దాష్టీకానికి సాయికృష్ణ బలై పోయాడనేది చూచాయిగా అందరూ అనుకుంటున్న వాస్తవం. ఇదే ఇప్పుడు తేలాల్సి ఉంది. దీన్ని ఇప్పుడు వైఎస్సార్ సీపీ బలంగా వాడుకుంటోంది. కూటమి ప్రభుత్వాన్ని జనం ముందు దోషిలా నిలపాలని ప్రయత్నం చేస్తోంది.