Online Loan Fraud: ఆన్లైన్ లోన్ల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ అనే ఐదుగురు నిందితులు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చదువు మధ్యలో ఆపేసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వీరు ఈ దారి ఎంచుకున్నారు. కోల్కతా, ఢిల్లీ కేంద్రాలుగా ‘ముద్రా లోన్ సర్వీసెస్’ పేరుతో వీరు నెట్వర్క్ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్కు చెందిన ఓ మహిళ ఇన్స్టాగ్రామ్లో లోన్ ప్రకటన చూసి క్లిక్ చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజే ఆమెకు నిందితుల్లో ఒకరైన కిలా పవన్ కుమార్ ఫోన్ చేసి, ముద్రా లోన్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. రూ. 3 లక్షల లోన్ మంజూరైందని నమ్మబలికిన నిందితులు, ప్రాసెసింగ్ ఫీజు లేదని చెబుతూనే ఇన్సూరెన్స్, TDS, ఇన్కమ్ టాక్స్ ఛార్జీల పేరుతో బాధితురాలి నుండి మొత్తం రూ. 1,08,274 కాజేశారు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ముఠాకు కోల్కతాలో ‘కృష్ణ అలియాస్ కిట్టు’ అనే మేనేజర్ ఆశ్రయం కల్పించి, జనాలను ఎలా మోసం చేయాలో శిక్షణ ఇచ్చేవాడని పోలీసులు వెల్లడించారు. వీరు ప్రతిరోజూ 180 నుండి 200 కాల్స్ చేస్తూ డేటా ఆధారంగా బాధితులను వేటాడుతుంటారు. వసూలైన మొత్తంలో ఈ ఐదుగురు నిందితులకు కృష్ణ 30 శాతం కమిషన్ ఇచ్చేవాడు. సోషల్ మీడియాలో వచ్చే తక్కువ వడ్డీ లోన్ ప్రకటనలను నమ్మి వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.