iBomma Case: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఐబొమ్మ రవి కేసుపై సీసీఎస్ అడిషినల్ సీపీ శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రవికి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నుంచి భారీగా డబ్బులు వచ్చేవన్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినందుకు భారీగా యాడ్ వచ్చేవని తెలిపారు. దీంతో యాడ్ బుల్ కంపెనీని రవి ఏర్పాటు చేశారన్నారు. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బుల్ని యాడ్ బుల్ కంపెనీకి మళ్లించేవాడని చెప్పారు. ఇప్పటి వరకూ రవి రూ. 20 కోట్లు వరకు సంపాదించాడని అడిషినల్ సీపీ తెలిపారు.
ఐ బొమ్మ వెబ్సైట్ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డొమైన్ను ఎన్జీల కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసినట్లు గుర్తించారు. ఐ బొమ్మ, బప్పం వెబ్సైట్ల ద్వారా రవి పైరసీ సినిమాలను పోస్ట్ చేసేవాడన్నారు. ఇందుకు రవి వెబ్సాఫ్ట్వేర్లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశాడన్నారు.
‘ఎన్జీలలో మొదటి డొమైన్ రిజిస్టర్ చేశాడు. దీనికి రవి తన డెబిట్ కార్డు, ఈమెయిల్ ఐడీ ఇచ్చాడు. ఐపీ వాల్యూమ్ అనే హోస్టింగ్ కంపెనీని వినియోగించాడు. ఆ తర్వాత కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీనిని ఆపరేట్ చేసేందుకు ఓ ఫ్యానెల్ ఉంటుంది. ఆ తర్వాత క్రియేటింగ్ పోస్టు ఉంటారు. వీళ్లు సినిమాల పోస్టర్లు తయారు చేస్తారు. ఇందుకు నిఖిల్ అనే వ్యక్తి సహాయం చేశాడు. ఈ పోస్టర్ కు ఒక లింక్ ఉంటుంది. అలాగే స్ట్రీమింగ్ లింక్, డౌన్ లోడ్ లింక్ కూడా ఉంటుంది. అన్ని ఏర్పాటు చేశాక పబ్లిష్ చేస్తారు. చివరికి వెబ్ సైట్ లో కంటెంట్ ప్రజలు వీక్షించవచ్చు. ఇది ఐబొమ్మ బ్యాగ్రౌండ్ లో జరిగేది’ అని ఏసీపీ తెలిపారు.
‘ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్ల నుంచి గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లకు వెళ్లేలా సాఫ్ట్ వేర్ డిజైన్ చేశాడు. ఇప్పటికీ కొన్ని పైరసీ వెబ్సైట్లు నడుస్తు్న్నాయి. మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పైరసీ వెబ్సైట్లు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఆ వెబ్సైట్ల నిర్వాహకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఐబొమ్మ పాపులర్ అయ్యాక ఆ పేరును చాలా మంది వాడుకున్నారు. సినిమా సమీక్షలకు ఆ వెబ్సైట్ పేరు వాడుకున్నారు. భవిష్యత్లో వెబ్-3 టెక్నాలజీ రానుంది. పైరసీ చేస్తే పట్టుకోవడం చాలా కష్టంగా మారనుంది. ఐబొమ్మ రవి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడంతో పట్టుబడ్డాడు. రవి భార్య మాకు సమాచారం ఇవ్వలేదు. ఆ వార్తలు అవాస్తవం’ -ఏసీపీ శ్రీనివాస్
రవి భార్యను తాము విచారించలేదని ఏసీపీ తెలిపారు. పైరసీ వ్యవహారం దర్యాప్తు చాలా కష్టంతో కూడిన వ్యవహారమన్నారు. ఐబొమ్మ రవి వారానికో దేశం తిరిగేవాడని, ఈజీ మనీకి అలవాటు పడ్డాడన్నారు. లక్ష డాలర్లు ఖర్చు పెట్టి కరేబియన్ దీవుల పౌరసత్వం కొన్నాడన్నారు. రవి వెబ్సైట్లకు నిఖిల్ అనే వ్యక్తి పోస్టర్లు డిజైన్ చేసేవాడని ఏసీపీ తెలిపారు. సోమవారం సాయంత్రంతో ఐబొమ్మ రవి పోలీసు కస్టడీ ముగిసింది. చివరి రోజు కస్టడీలో అధికారులు మూడు గంటల పాటు అతడ్ని విచారించారు.