Mahesh Babu Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టులోకి మహేష్ బాబు అడుగుపెట్టి ఏడాది దాటింది. కానీ ఓపెనింగ్ కి సంబంధించి అంటే పూజా కార్యక్రమాలకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు వదల్లేదు. ఇటీవల టైటిల్ గ్లిమ్ప్స్ ఈవెంట్ జరిగింది. హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో ఈ వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ మహేష్ బాబు లుక్ ను అలాగే.. ‘వారణాసి’ వరల్డ్ ను కూడా పరిచయం చేశారు.
మహేష్ బాబు ఇప్పటి వరకు పౌరాణిక సినిమాల్లోకి నటించింది లేదు. ‘కల్కి 2898 AD’ సినిమా రిలీజ్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది సినీ అభిమానులు కృష్ణుడి గెటప్లో మహేష్ బాబు కనిపిస్తే బాగుంటుందని ఆశపడ్డారు. ‘హనుమాన్’ సినిమా టైంలో అయితే రాముడిగా మహేష్ నటిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఫైనల్ గా ‘వారణాసి’ లో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నట్టు స్వయంగా దర్శకుడు రాజమౌళి రివీల్ చేసిన సంగతి తెలిసిందే. సో అలా ‘వారణాసి’ మహేష్ బాబు అభిమానులకు ప్రత్యేకంగా నిలవనుంది. ఇక ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ‘శ్రీ దుర్గ ఆర్ట్స్’ అధినేత కె.ఎల్.నారాయణ్ నిర్మిస్తున్నారు.
నిజానికి కె.ఎల్.నారాయణ్ ‘పోకిరి’ రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబుకి, ‘విక్రమార్కుడు’ రిలీజ్ అయినప్పుడు రాజమౌళికి అడ్వాన్సులు ఇచ్చారు కె.ఎల్.నారాయణ్. కానీ మొదటి వీరి కాంబినేషన్లో సినిమా చేయాలనే ఆలోచన ఆయనకి లేదు. హిట్లు కొట్టారు కాబట్టి.. ఆ టైంలో అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేశారు. ఈ క్రమంలో ‘సైనికుడు’ తర్వాత మహేష్ బాబు… కె.ఎల్.నారాయణ్ కి వెంటనే సినిమా చేసి పెట్టేందుకు రెడీ అయ్యారు.
‘ఒక్కడు’ ‘అర్జున్’ సినిమాలకి కో డైరెక్టర్ గా పనిచేసిన హేమాంబర్ జాస్తి చెప్పిన కథని ఓకే చేశారు. అతన్ని దర్శకుడిగా లాంచ్ చేసేందుకు కూడా రెడీ అయ్యారు. అలాగే ఆ ప్రాజెక్టుకి ‘మిర్చి’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మహేష్ బాబు ‘సైనికుడు’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. కె.ఎల్.నారాయణ్ జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన ‘రాఖీ’ కూడా నష్టాలనే మిగిల్చింది. దీంతో ‘మిర్చి’ ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు మహేష్,కె.ఎల్.నారాయణ్.
తర్వాత కె.ఎల్.నారాయణ్ కి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ తన అడ్వాన్స్ రాజమౌళి వద్ద ఉంది కాబట్టి.. మహేష్ బాబుతోనే ఆ ప్రాజెక్టుని సెట్ చేస్తే బాగుంటుందని ఇద్దరికీ చెప్పారు. మహేష్ – రాజమౌళి ఇద్దరూ కలిసి పనిచేయాలని 2007 లోనే ఫిక్సయ్యారు. అంటే ‘మగధీర’ ‘బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రాజెక్టులు రాజమౌళి మైండ్లో లేని రోజుల్లోనే మహేష్- రాజమౌళి కాంబో ఫిక్స్ అయ్యింది.
అయితే మహేష్ కోసం రిజిస్టర్ చేసి పెట్టుకున్న ‘మిర్చి’ టైటిల్ ను తర్వాత ప్రభాస్ సినిమా కోసం వాడారు. ఇక హేమాంబర్ జాస్తి.. తెలుగులో హిట్ అయిన ‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాని తమిళంలో ‘కేరాఫ్ కాదల్’ పేరుతో రీమేక్ చేశాడు. దర్శకుడిగా అతనికి మొదటి సినిమా అదే.