వివాహేతర సంబంధాలు మన సమాజానికి కొత్తేమీ కాదు. గతంలో ఇవి గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయేవి. చీకటి బంధాలు బయటపడితే ఆ కాపురంలో చిచ్చు మొదలవుతుంది. మహా అయితే వీడికి విడాకులే ముగింపు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భార్యల వివాహేతర సంబంధాలు భర్తల ప్రాణాలు బలికోరుతున్నాయి. పరాయి మగాడిపై మనసు పడిన భార్య, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని అనుకుంటే ఏకంగా భర్తను పైకి పంపడానికే సిద్ధపడుతోంది. సుపారీ ఇచ్చి మరీ భర్తల్ని హత్య చేయిస్తున్న భార్యలున్నాయి. ఆ ఖర్చుకూడా ఎందుకు అనుకుంటే.. ప్రియుడితో కలసి తన చేతులతో తనే మట్టుపెట్టే క్రూర మనస్తత్వం కలవారు కూడా ఉన్నారు. అయితే ఇటీవల ఈ పోకడ భారత్ లో బాగా పెరిగిపోవడం విశేషం. భర్త, పిల్లలతో చక్కని సంసారం ఉన్నా కూడా అక్రమ సంబంధాల మోజులో జీవితాల్ని నాశనం చేసుకుంటున్న భార్యల సంఖ్య పెరుగుతోంది. మీరట్ లో మాజీ మర్చంటే నేవీ అధికారి దారుణ హత్యతో ఈ ఘాతుకాలు మరోసారి సంచలనంగా మారాయి. మీరట్ ఘటనతోపాటు.. మార్చి నెలలో దేశవ్యాప్తంగా సరిగ్గా ఇలాంటి కారణంతోనే మొత్తం 4 ఘోరాలు జరగడం ఆందోళనకరం.
భర్తను చంపి.. 15 భాగాలుగా నరికి
ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పుత్ ని అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలసి మట్టుబెట్టారు. అత్యంత కిరాతకంగా చంపి, డెడ్ బాడీని ముక్కలు చేసి మాయం చేయాలనుకున్నారు. సిమెంట్ డ్రమ్ లో డెడ్ బాడీ ముక్కలను పెట్టి మూసివేశారు. చివరకు పోలీసులకు చిక్కారు. ఈ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాలనుంచి భర్త పంపించే సంపాదనతో ఇక్కడ భార్య రస్తోగి, ప్రియుడితో కలసి జల్సా చేసేది. భర్త ఇండియాకు రాగానే హత్యకు ప్లాన్ చేసి పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేసుకుంది.
భర్త శవాన్ని మోటర్ సైకిల్పై తీసుకెళ్తూ..
రాజస్థాన్ లోని జైపూర్ లో ధన్నాలాల్ సైని అనే వ్యక్తిని భార్య గోపాలి దేవి, ప్రియుడు దీన్ దయాల్ తో కలసి హత్య చేసింది. వివాహేతర సంబంధాన్ని భర్త ప్రశ్నించడంతో భార్య ఏకంగా అతడి హత్యకే పూనుకుంది. ధన్నాలాల్ మృతదేహాన్ని బైక్ పై తరలిస్తూ వారిద్దరూ పోలీసులకు చిక్కారు. ఇదే నెలలో ఈ ఘటన జరిగింది.
భర్తను చంపి కాల్వలో పడేసి
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భర్త సుఖ్ పాల్ సింగ్ ని ఏకంగా గొంతుకోసి హత్య చేసింది భార్య రీతూ కౌర్. ఆమె ప్రియుడు రితిక్ సింగ్ కూడా ఈ హత్యకు సహకరించాడు. మృతదేహాన్ని కాలవలో పడేసి మాయం చేయాలనుకున్నారు. కానీ చివరకు భార్య, ఆమె ప్రియుడు కటకటాల వెనక్కు వెళ్లారు.
భర్తను చంపి.. గోదుమల తోటలో పాతేసిన ఇల్లాలు
ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ లో హరీష్ కుమార్ అనే వ్యక్తిని భార్య హత్య చేసింది. ఆ తర్వాత తన భర్త తప్పిపోయాడంటూ పోలీస్ కేసు పెట్టింది పారుల్ సింగ్. భార్య ఓవర్ యాక్షన్ ని పోలీసులు అనుమానించారు. తమదైన శైలిలో ప్రశ్నించడంతో ప్రియుడితో కలసి తానే హత్య చేసినట్టు ఒప్పుకుంది. భర్త శవాన్ని గోధుమ మొక్కల మధ్య పాతిపెట్టినట్టు చెప్పింది.
బాయ్ ఫ్రెండ్ తో కలసి హత్య
మహారాష్ట్రలోని థానేలో గతేడాది జరిగిన దారుణం ఇది. 25 ఏళ్ల మహిళ, తన 23 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ తో కలసి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. గుట్టు చప్పుడు కాకుండా కొన్నాళ్లు అక్రమ సంబంధాన్ని నెరిపింది. ఆ తర్వాత విషయం భర్తకు తెలియడంతో అతడ్ని హత్య చేసింది. మృతదేహాన్ని వాగులో పడేసి సాక్ష్యాధారాలు మాయం చేయాలనుకుంది. కానీ పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు.
తెలంగాణలో కూడా..
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఇలాంటి ఘటన సంచలనంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వరంగల్ భట్టుపల్లి రోడ్ లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై దుండగులు దాడి చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆరా తీస్తే సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా, ఆమె జిమ్ ట్రైనర్ శామ్యూల్ మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయటపడింది. శామ్యూల్ తో ప్రేమ మత్తులో పడిపోయిన ఫ్లోరా కట్టుకున్న భర్తనే హత్య చేయిచాలనుకుంది. పైగా ఇక్కడ ఫ్లోరా, సుమంత్ రెడ్డిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కూడా హత్య చేయాలనుకుంది అంటే ఆ అక్రమ సంబంధం ఎంత గాఢంగా అల్లుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు
జీవితాలు నాశనం..
గృహ హింస, లేదా వరకట్న వేధింపులు.. వంటి ఘటనల్లో భార్యలు తిరగబడితే దానికో అర్థముంది. కానీ ప్రేమగా చూసుకునే భర్తలనే భార్యలు వద్దనుకుంటున్నారు. పరాయి మగవాడి మోజులో పడి భర్తల్ని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు. క్షణికావేశానికి గురై కుటుంబ జీవనాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు. తప్పు ఎన్నటికీ దాగదు. పైగా ఇలాంటి హత్యల వెనక ఉన్న కారణాలు ఇట్టే బయటపడతాయి. ఆ తర్వాత సమాజంలో వారి పరువు ఏమవుతుంది..? జైలుకెళ్లి వచ్చిన తర్వాత ఎలాంటి జీవనం గడుపుతారు. వయసులో ఉన్నప్పుడు తప్పు చేస్తే.. ఆ మోజు తగ్గిపోయాక ప్రియుడు కాదనడని గ్యారెంటీ ఏంటి..? ఇంత దూరం ఆలోచిస్తే అసలు అక్రమ సంబంధాల వైపు భార్యలు అడుగు వేయరేమో..