Karthika Masam 2025: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది అయినప్పటికీ.. ముఖ్యంగా సోమవారం రోజున శివుడిని ఆరాధించడం అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం విశిష్టమైనదే అయినా.. చివరి కార్తీక సోమవారానికి మరింత ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. ఈ ఒక్క సోమవారం వ్రతం ఆచరించడం వల్ల కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివయ్య అనుగ్రహాన్ని పొంది, సకల శుభాలు, ఐశ్వర్యం సిద్ధించడానికి చివరి సోమవారం నాడు ఆచరించవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం.
పూజా విధానం, ఆచరించాల్సిన నియమాలు:
ఉపవాసం, స్నానం: కార్తీక సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేసి పరిశుభ్రమైన బట్టలు ధరించాలి. కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. నదిలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే.. ఇంటి వద్దనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పవిత్ర నదీ జలాన్ని కలుపుకోవచ్చు. రోజు మొత్తం ఉపవాసం ఉండడం ఉత్తమం. ఉపవాసం ఉండలేనివారు పాలు, పండ్లు, అల్పాహారం తీసుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని నక్తం అంటారు.
పూజా కార్యక్రమం:
దీపారాధన: ఇంటిలో పూజా మందిరాన్ని శుభ్రం చేసి.. తులసికోట దగ్గర, శివుని పటాల ముందు దీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
శివలింగ పూజ: కార్తీక సోమవారం రోజు శివలింగాన్ని పూజించడం ప్రధానమైనది. శివలింగానికి పాలాభిషేకం, లేదా పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధపు నీరు వంటి పంచామృతాలతో అభిషేకం చేయాలి.
నైవేద్యం, అలంకరణ: శివుడికి మారేడు దళాలు (బిల్వ పత్రాలు), తెల్లటి పువ్వులు, జిల్లేడు పువ్వులు, అక్షతలతో పూజ చేయాలి. పాయసం లేదా పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించాలి.
మంత్ర పఠనం: భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, లేదా శివ అష్టోత్తరం, శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది.
కార్తీక పురాణం: కార్తీక వ్రతం ఆచరించే ప్రతి ఒక్కరూ కార్తీక పురాణం చదవడం లేదా వినడం తప్పనిసరి.
ప్రదోష కాల పూజ: సూర్యాస్తమయం తరువాత వచ్చే ప్రదోష కాలం శివారాధనకు అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలో మరోసారి దీపారాధన చేసి, వీలైతే శివాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని అక్కడ కూడా దీపాలను వెలిగించాలి.
ముఖ్యంగా చివరి సోమవారం: చివరి కార్తీక సోమవారం నాడు 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం లేదా 365 మందికి దానధర్మాలు చేయడం వల్ల ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలితం దక్కుతుందని విశ్వాసం. శివయ్యను భక్తితో ప్రార్థించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి, సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు.
Also Read: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !
వ్రత ఫలితం:
కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున నిష్టగా ఉపవాసం ఉండి, శివుడిని ఆరాధించిన వారికి మోక్షం లభిస్తుందని, జన్మరాహిత్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి, ఐశ్వర్యం, సౌభాగ్యం చేకూరుతాయి. భోళాశంకరుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి, కోరికలు తీరి, జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి.