Jagtial Murder Case: ఇన్స్టాగ్రామ్ పరిచయం ఒక యువకుడి ప్రాణాలు తీసిన భయానక ఘటన.. జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన స్నేహం క్రమంగా బ్లాక్మైల్, బెదిరింపులు, చివరకు పథకబద్ధమైన హత్యకు దారి తీసినట్లు పోలీసులు వెల్లడించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాల ప్రకారం, ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్గౌడ్ (33) ఇన్స్టాగ్రామ్లో.. సంధ్య అనే ఐడీతో జగిత్యాల పట్టణంలోని శంకులపల్లి ప్రాంతానికి చెందిన బైరవేని సమతతో స్నేహం పెంచుకున్నాడు. మొదట తాను అబ్బాయినని, తమది ఒకటే కులమని, తనకు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించాడు. ఈ పరిచయం స్నేహంగా మొదలై క్రమంగా వ్యక్తిగత చాటింగ్, కాల్స్ వరకు వెళ్లింది. ఇదే సమయంలో సమత అక్క సంధ్యతో కూడా పరిచయం పెంచుకున్నాడు.
సమతకు తెలియకుండా సంధ్య ఫోన్ను హ్యాక్ చేసిన మహేందర్, ఆమె మొబైల్ నంబర్ను లేడీస్ సారీస్ కలెక్షన్స్ అనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి తరచూ చాటింగ్ చేయసాగాడు. అయితే కొంతకాలానికి మహేందర్కు వివాహం అయిందని విషయం తెలిసిన సమత అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. ఇదే సమయంలో సమతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసిన మహేందర్ తీవ్రంగా స్పందించాడు.
తనతోనే పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి పెళ్లికొడుకుకు పంపిస్తానని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని సమతను బెదిరించాడు. అంతేకాదు, ఆమె అక్క సంధ్యతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేస్తానని భయపెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన సమత జరిగిన విషయం అంతా తన అక్క సంధ్యకు చెప్పింది. ఇద్దరూ కలిసి విచారించగా, తమ ఇద్దరితోనూ స్నేహం చేసింది ఒకే వ్యక్తి అని స్పష్టమైంది.
ఈ విషయాన్ని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వారి మేనమామ నరేశ్కు సంధ్య, సమతలు తెలిపారు. మహేందర్ బెదిరింపులు, బ్లాక్మైల్ భరించలేకపోయిన నరేశ్, సంధ్య కుమారుడు రాజశేఖర్, అతని ఇద్దరు స్నేహితులతో కలిసి మహేందర్ను హత్య చేయాలని పథకం రూపొందించారు. సంధ్యతో మహేందర్కు ఫోన్ చేయించి లక్ష్మీపూర్ గ్రామానికి రావాలని పిలిపించారు.
శుక్రవారం మహేందర్ శనివారం కలవడానికి వస్తానని వాట్సాప్ మెసేజ్ పంపగా, దానికి కూడా సంధ్య ఒకే అని చెప్పడంతో.. రాత్రి 10–11 గంటల సమయంలో కొత్త బస్టాండ్ వద్ద కలవాలని చెప్పడంతో ముందుగానే పథకం ప్రకారం ఏర్పాట్లు చేశారు. సమతను అమ్మమ్మ ఇంట్లో ఉంచి, నరేశ్ కారులో జగిత్యాల కొత్త బస్టాండ్కు చేరుకున్నారు. వెనక నుంచి స్కూటీపై రాజశేఖర్ అతని స్నేహితులతో వచ్చాడు.
మహేందర్ రాగానే సంధ్య అతడిని స్కూటీపై ఎక్కించుకుని లక్ష్మీపూర్కు బయలుదేరింది. వెనకాలే కారు ఫాలో అవుతూ నరేశ్ బృందం వెళ్లింది. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అనుమానం వచ్చిన మహేందర్ పారిపోవడానికి ప్రయత్నించగా, సంధ్య గేటు వద్ద పట్టుకుంది. వెంటనే నరేశ్, రాజశేఖర్, మరో ఇద్దరు కలిసి అతడిని కొట్టి బెదిరించి ఫోన్ లాక్కున్నారు. సంధ్య ఇంట్లో ఉన్న కారంపొడిని మహేందర్పై చల్లగా, తీవ్ర గాయాలైన అతడు కిందపడిపోయాడు. ఆపై కర్రలు, ఇనుపరాడ్తో దాడి చేయడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
Also Read: ఖతార్ దేశంలో కోనసీమ యువకుడు.. ఉపాధి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..
తక్షణమే జగిత్యాల ఆస్పత్రికి తరలించినా అప్పటికే మహేందర్ మృతి చెందాడు. మృతుని తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, లక్ష్మీపూర్ గ్రామ శివారులో నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి స్కోడా కారు, స్కూటీ, ఇనుపరాడ్, కర్ర, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా పరిచయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.