Konaseema: కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన యువకుడు ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. ముంగండ రవితేజ అనే యువకుడు కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశమైన ఖతార్కు వెళ్లాడు. అక్కడ అతను ‘హౌస్ కేరింగ్ వర్క్’ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మెరుగైన భవిష్యత్తు కోసం కష్టపడుతున్న తరుణంలో.. ఈ నెల 16వ తేదీ రాత్రి రవితేజకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. చేతికి అందిన కొడుకు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
పరాయి దేశంలో మరణించిన రవితేజ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం ఆ పేద కుటుంబానికి భారంగా మారింది. ఈ క్రమంలో మృతుని కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి.. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో మాట్లాడి విషయాన్ని వివరించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు KCM (Konaseema Coordination Mission) బృందం రంగంలోకి దిగింది. వారు బాధితుల ఇంటికి వెళ్లి అవసరమైన వివరాలు, పత్రాలను సేకరించారు. విదేశాల్లో ఉన్న మృతదేహాన్ని రప్పించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు.
ఖతార్లోని ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్కుమార్లతో KCM బృందం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంది. అధికారిక లాంఛనాలన్నీ పూర్తి చేసి.. రవితేజ భౌతికకాయాన్ని నిన్న వన్నెచింతలపూడికి చేర్చారు. తమ బిడ్డను చివరిసారి చూసుకునే అవకాశం కల్పించినందుకు మృతుని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు, కలెక్టర్కు, KCM బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో విషాద ఛాయల మధ్య రవితేజ అంత్యక్రియలు జరిగాయి.