పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ మరోసారి ఉగ్రవాద కోరల్లో చిక్కి విలవిలలాడింది. నగరంలోని షియా కమ్యూనిటీ లక్ష్యంగా జరిగిన ఒక భీకర ఆత్మాహుతి దాడితో దేశం యావత్తు దిగ్భ్రాంతికి లోనైంది. శుక్రవారం కావడంతో మస్జిద్లో నమాజ్ కోసం భారీ సంఖ్యలో భక్తులు హాజరైన సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ దాడిలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 69కి చేరగా, మరో 160 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ప్రార్థన వేళ పెను విషాదం..
శుక్రవారం మధ్యాహ్నం మస్జిద్లో ప్రార్థనలు జరుగుతుండగా, ప్రవేశ ద్వారం వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిని తప్పించుకుని ఒక ఆత్మాహుతి బాంబర్ లోపలికి ప్రవేశించాడు. ప్రార్థనలో అందరూ నిమగ్నమై ఉన్న తరుణంలో నిందితుడు తనను తాను పేల్చుకున్నాడు. పేలుడు తీవ్రతకు మస్జిద్ గోడలు కూలిపోయాయి, పైకప్పు కొంత భాగం ధ్వంసమైంది. క్షణాల్లో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. రక్తం ఓడుతున్న శరీరాలు, మృతదేహాల మధ్య బాధితుల ఆర్తనాదాలతో మస్జిద్ ప్రాంగణం భీతావహంగా మారింది.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పాక్ రేంజర్లు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిన్నాభిన్నం కావడంతో మృతుల గుర్తింపు కష్టతరంగా మారింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఇస్లామాబాద్లోని ప్రధాన ఆసుపత్రులన్నింటిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఎమర్జెన్సీ విధింపు..
ఈ దారుణ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్లో అత్యవసర పరిస్థితిని (Emergency) విధించింది. నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది.
ఈ ఘటనతో పాకిస్థాన్లో అంతర్గత భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా షియా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు మస్జిద్ వద్దకు చేరుకుని బోరున విలపిస్తుండటంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి.
ALSO READ: East Godavari: తూ.గో జిల్లాలో పెద్ద పులి.. రాత్రంతా పాడుబడిన ఇంట్లోనే.. ఆపరేషన్ టైగర్ షురూ