Road Accident: చత్తీస్గఢ్ లోని జష్ పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. దుల్దులా పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్రాటోలి సమీపంలో ట్రక్కును కారు ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మరణించిన ఐదుగురు వ్యక్తులు జశ్పూర్ జిల్లా చరైదంద్ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. వీరు ఉదయం ఇంటి నుంచి బయలుదేరి సమీప పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. కారు అధిక వేగంతో వస్తుండగా ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే.. లాలాగూడ పీఎస్ పరిధిలోని లాలాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వాళ్లు మల్కాజ్గిరి కి చెందిన హర్షిత్ రెడ్డి(22), చెంగిచర్ల కు చెందిన శివమణి (23)గా గుర్తించారు పోలీసులు.నలుగురు స్నేహితులు కీసర నుంచి తార్నాకకు టిఫిన్ చేసేందుకు వెళ్తుండగా ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.