శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇవాళ 115 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులు గడుస్తున్నా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రయాణికులు నిరసన తెలుపుతున్నారు. ఇరుముడి కట్టుకొని వచ్చాక ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పడంతో.. శబరిమలకు ఎలా వెళ్లాలంటూ అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేటలో కారు డివైడర్ను ఢీకొట్టడంతో హర్షిత్ రెడ్డి, శివమణి అనే ఇద్దరు యువకులు మరణించారు. కీసర నుంచి తార్నాకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరు యువకులు చికిత్స పొందుతున్నారు.
ములుగు జిల్లాలోని మంత్రి సీతక్క స్వగ్రామం జగ్గన్నపేటలో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ బలపర్చిన అర్రెం వెంకన్నను గ్రామ పెద్దలు ఎన్నుకున్నారు. తన ఆశీర్వాదంతో ఎన్నికైన వెంకన్నకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. వెంకన్న గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఎగ్గొట్టిందని, ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే రైతు బంధు సక్రమంగా ఇచ్చామని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోనిచ్చారు. కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక కేంద్రం అరకులోయ పర్యాటకలతో కిటకిటలాడుతోంది. వీకెండ్ కావడంతోపాటు, అరకులోయలో మంచు విపరీతంగా కురుస్తుండటంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూకట్టారు. పర్యాటక వాహనాలతో అరకులోయ ప్రధాన రహదారి నిండిపోయి, ప్రాంతమంతా సందడిగా మారింది.
గుంటూరు జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో… సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమాన్ని ఈగల్ చీఫ్ రవికృష్ణ, కలెక్టర్, ఎస్పీ కలిసి ప్రారంభించారు. గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తోందని, యువత భవిష్యత్తును కాపాడుకోవాలని రవికృష్ణ కోరారు.
అమరావతి రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ పూర్తైంది. ఇటీవల భూసేకరణ సమస్యలు పరిష్కారం అయ్యి. రెండో దశ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్డు పూర్తి అయితే కరకట్ట పై కొత్త వరకు వాహనాల రద్దీ తగ్గుతుంది.
తిరుమల లడ్డూలకు సంబంధించిన కల్తీ నెయ్యి కేసులో టీటీడీ అధికారులు, ఉద్యోగులపై సిట్ దృష్టి సారించింది. ఈ కేసులో త్వరలో మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ జీఎం, ఈఈ సుబ్రమణ్యాన్ని సిట్ అరెస్ట్ చేసింది. కేసులో ప్రమేయం ఉండి, ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగుల పూర్తి వివరాలను సిట్ ఉన్నతాధికారులు టీటీడీకి పంపారు.
గూడూరు మండలం చిన్న ఎల్లాపురంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి స్థానిక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మద్దతు పలకడం వింతగా మారింది. రాష్ట్ర స్థాయిలో వైరం ఉన్నా.. గ్రామ స్థాయిలో ఈ మూడు పార్టీల స్నేహం చూసి ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.
మంచిర్యాల జిల్లాలోనీ ఒకే గ్రామంలో రెండు దేవాలయల్లో దొంగతనం జరిగిన ఘటన కలకలం రేపింది. రాపల్లి గ్రామంలో శివాలయం, రేణుక ఎల్లమ్మ రెండు గుళ్ళలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని జాగిలాలతో, క్లూస్ టీం ధ్వారా ఆధారాలు సేకరించారు. త్వరలో దొంగలను పట్టుకొనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మదనపల్లి పైల్స్ దగ్ధం కేసులో ఏ1 నిందితుడు రైస్ మిల్ మాధవరెడ్డి కోసం సీఐడీ గాలిస్తోంది. ఇటీవల హైకోర్టు సీఐడీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అరెస్టుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అధికారులు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.
భీమడోలు మండలం పూళ్ళలో పాత కక్షల కారణంగా ఇసాక్ కోళ్ల షెడ్డు, కారు, బడ్డీ కొట్టు దగ్ధం చేసిన కేసులో పోలీసులు 19 మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు బొల్లారపు పవన్ రాజ్ కుమార్ సహా నిందితులను కోర్టు 14 రోజుల రిమాండ్కు విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అధిక వేగం కారణంగా రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్ బస్సు బోల్తాపడింది. గుంటూరు నుంచి శబరిమలకు అయ్యప్ప భక్తులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది అయ్యప్ప స్వాములు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. ద్విచక్రవాహనదారులు, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ అధికారుల అంతులేని నిర్లక్ష్యంతోనే ప్రజలు కుక్కల దాడిలో గాయపడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
గోవాలోని ఓ నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా మరణించడం బాధాకరమన్నారు రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలిపారు. ఇది భద్రత, పాలన నేరపూరిత వైఫల్యమని, సమగ్ర దర్యాప్తు జరిపి జవాబుదారీతనం నిర్ధారించాలని, ఇటువంటి విషాదాలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఎక్స్లో పోస్ట్ చేశారు.
గాజా యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ దెయ్యాలతో పోరాడుతోందని, కొత్త శత్రువుల కోసం వెతుకుతోందని సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా దోహా ఫోరంలో ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ దూకుడును విమర్శించిన ఆయన.. శాంతి సందేశాలను తిరస్కరించిందన్నారు. సిరియా భూభాగం నుంచి బలగాలను ఉపసంహరించి, 1974 యుద్ధ విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్నారు.
కెనడా-అలాస్కా సరిహద్దు ప్రాంతంలో ఇవాళ భారీ భూప్రకంపనలు సంభవించాయి. యూకోన్లో సంభవించిన ఈ ప్రకంపనలు వైట్ హార్స్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించేలా చేశాయి. భూకంప కేంద్రం ఉత్తర జెనీవాకు 230 మైళ్ల దూరంలో ఉంది. ప్రజలు భయాందోళన చెందారు, అయితే ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్నిప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. ఈ ఘటన మరణించిన వారికి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సినీ నటి ప్రగతి తాజాగా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయ్యారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ విమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆమె నాలుగు పతకాలు సాధించారు. ఇందులో ఒక గోల్డ్ మెడల్తో పాటు మూడు సిల్వర్ మెడల్స్ ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సింహాచలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఆలయ అధికారులు.. విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం కోహ్లీ కప్పస్తంభం వద్ద ఆలింగనం చేసుకుని ప్రత్యేక ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వాదం ఇచ్చారు.