ఖమ్మం నగరం బూర్హన్పురంలో ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తండ్రి, పెద్ద కుమార్తె మృతి చెందగా, భార్య, చిన్న కుమార్తె చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా లభించిన సమాచారం ప్రకారం, ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం అనంతనగరం గ్రామానికి చెందిన కనతాల రాము (32) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బూర్హన్పురంలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఒక ప్రముఖ పత్రికలో రిపోర్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆదివారం రాము తన భార్య రమ్య, కుమార్తెలు దివ్య (5), దీక్షిత (3) లతో కలిసి విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రాము, పెద్ద కూతురు దివ్య అక్కడికక్కడే మరణించగా, భార్య రమ్య, చిన్న కూతురు దీక్షిత పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారిద్దరూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాము మృతి అనుమానాస్పదంగా ఉండటంతో క్లూస్ టీమ్, ఉన్నతాధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఈ విపరీతమైన నిర్ణయం తీసుకున్నారా లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. జర్నలిస్టుగా పని చేస్తూ అందరి సమస్యలపై గళం వినిపించే రాము, ఇలా అర్ధంతరంగా కుటుంబంతో సహా ఆత్మహత్యకు పూనుకోవడం స్థానిక పాత్రికేయ వర్గాల్లో.. బూర్హన్పురంలో విషాద ఛాయలు నింపింది.
Read Also: విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్.. ఏడుగురికి గాయాలు!