Kamareddy Bus Stand Murder: కామారెడ్డి జిల్లా కేంద్రంలో అత్యంత స్వల్ప కారణంతో ఒక నిండు ప్రాణం బలికావడం స్థానికంగా కలకలం రేపింది. కేవలం 300 రూపాయల కోసం జరిగిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. కామారెడ్డి పాత బస్టాండ్ ఆవరణలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అభాగ్యుడైన ఒక వ్యక్తిపై నిందితుడు విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని శ్రీనివాస్ అని గుర్తించారు. నిన్న రాత్రి కామారెడ్డి బస్టాండ్ సమీపంలో శ్రీనివాస్కు, మరొక వ్యక్తికి మధ్య 300 రూపాయల నగదు విషయంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నిందితుడు ఆగ్రహంతో ఊగిపోయి శ్రీనివాస్పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. బలంగా ముఖం, ఛాతిపై దెబ్బలు తగలడంతో శ్రీనివాస్ కుప్పకూలిపోయాడు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితుడు, శ్రీనివాస్ వద్ద ఉన్న సెల్ ఫోన్.. నగదును దోచుకుని అక్కడి నుండి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న కామారెడ్డి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బస్టాండ్ లోని సీసీటీవీ ఫుటేజీలు మరియు స్థానికుల సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించి గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. ఏఎస్పీ (ASP) చైతన్య రెడ్డి ఈ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. స్వల్ప మొత్తానికి ఒక మనిషిని హతమార్చడం విచారకరమని, నిందితుడిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Read Also: హనుమకొండలో ఘోరం.. మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి!