కామారెడ్డి జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక కల్లు దుకాణం విషయంలో బాధితుడిని తీవ్రంగా వేధిస్తూ సత్యనారాయణ పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. ఇబ్బందులు తాళలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ ఆపరేషన్ మొదలైంది.
బాధితుడి నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ లావాదేవీ సీఐ తన అద్దె ఇంట్లో నిర్వహిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సత్యనారాయణ నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఆయన వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా లెక్క చూపని మరో 45 వేల రూపాయలు లభ్యమయ్యాయి. ఈ అదనపు నగదుకు సంబంధించి సీఐ ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో అధికారులు ఆ మొత్తాన్ని కూడా సీజ్ చేశారు.
కల్లు దుకాణం యజమానికి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకే ఈ లంచం డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. బాధితుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏసీబీ అధికారులు అతని వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. సత్యనారాయణను అరెస్ట్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. అవినీతికి పాల్పడే అధికారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.
ALSO READ: BREAKING: ఉప్పల్ మెట్రో స్టేషన్కు బాంబు బెదిరింపు..! ఉలిక్కిపడ్డ ప్రయాణికులు