Karimnagar News: కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక దంపతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన.. వడ్లకొండ శ్రీహర్ష, ఆయన భార్య రుక్మిణి ఈ దారుణ ఘటనకు బలయ్యారు. గ్రామంలో శ్రీహర్ష పలువురికి లక్షల రూపాయల మేర డబ్బులు ఇప్పించినట్లు సమాచారం. అదే గ్రామానికి చెందిన రావికంటి అభిషేక్, పప్పుల రాజశేఖర్, వంగల భూపతిరెడ్డి, నాంపల్లి శ్రీనివాస్, పల్లె అనిల్ లకు శ్రీహర్ష పెద్ద మొత్తంలో నగదు ఇప్పించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అయితే కాలం గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, పైగా కొందరు డబ్బులు ఇచ్చిన వారే తిరిగి శ్రీహర్షపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిలాష్, భూపతిరెడ్డి అనే వ్యక్తులు డబ్బులు వెంటనే చెల్లించాలని శ్రీహర్షను బెదిరించినట్లు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. నిన్నటి రోజు డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న శ్రీహర్ష, కొద్దిపాటి వాయిదా కోరినప్పటికీ వారికి ఒప్పుకోలేదని సమాచారం.
ఈరోజు డబ్బుల చెల్లింపు వాయిదా ఉండడంతో గ్రామంలో తన పరువు పోతుందని పురుగుల మందు త్రాగి అత్మహత్య చేసుకున్నారు దంపతులు. కొంతసేపటికి కుటుంబ సభ్యులు గమనించి వారిని ఆస్పత్రికి తరలించేలోపే.. వారిద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తన చావుకు డబ్బులు ఇచ్చిన వారు, మానసికంగా వేధించిన డబ్బులు తీసుకున్న వారి పేరు సూసైడ్ నోట్ రాసి ఇంట్లోనే అత్మహత్య చేసుకున్నారు దంపతులు ఇద్దరు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నోట్లో విన్నవించినట్లు తెలిసింది.
Also Read: జలపాతం వద్ద అదేం పని.. గన్తో ఆ జంటని బెదిరించి, కిస్ పెట్టించి ఆ తర్వాత
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. బాధ్యులుగా పేర్కొన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.