Karnataka: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చేలా ఒక వైద్యుడు చేసిన ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది. వృత్తిరీత్యా ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే, తన స్వార్థం కోసం కన్నవారిలాంటి పెద్దమ్మ, పెద్దనాన్నలను అత్యంత పాశవికంగా హతమార్చాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ కిరాతకుడు, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
భద్రావతి పట్టణంలోని భూతనగుడికి చెందిన చంద్రప్ప(80), జయమ్మ(70) దంపతులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. వారి ముగ్గురు కుమారులు ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో స్థిరపడటంతో, ఈ వృద్ధ దంపతులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం వీరిద్దరూ తమ ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉండటం చూసి చుట్టుపక్కల వారు షాక్కు గురయ్యారు. ఇంట్లో ఉన్న నగలు, విలువైన సొత్తు మాయం కావడంతో ఇది దొంగల పనే అని అందరూ భావించారు.
అయితే, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. జయమ్మ సోదరి కుమారుడైన మల్లేశ్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పెద్దమ్మ దంపతులను పరామర్శించే నెపంతో వారి ఇంటికి వెళ్లాడు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న వారికి ‘నొప్పులు తగ్గుతాయి’ అని నమ్మబలికి విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చాడు. వైద్యుడన్న నమ్మకంతో వారు ఆ ఇంజక్షన్ వేయించుకోగా, కొద్దిసేపటికే వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు, బీరువాలోని నగదు తీసుకుని పరారయ్యాడు.
నేరం చేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా మరుసటి రోజు ఉదయం బంధువులతో కలిసి మృతదేహాల వద్దకు చేరుకుని మల్లేశ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఎవరికీ అనుమానం రాకుండా నాటక మాడాడు. కానీ, పోస్టుమార్టం నివేదికలో వారు విషపూరిత ఇంజక్షన్ల వల్ల చనిపోయారని తేలడంతో పోలీసుల నిఘా మల్లేష్పై పడింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తను చేసిన అప్పులు తీర్చుకోవడానికి ఈ ప్లాన్ వేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
Also Read: హైదరాబాద్లో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య.. కారణం ఏంటి?
నమ్మిన వారే నట్టేట ముంచుతారనే దానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ఒక పవిత్రమైన వృత్తిలో ఉండి, కేవలం డబ్బు కోసం ఆత్మీయులనే బలితీసుకున్న ఈ వైద్యుడి ఉదంతం సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.