Family Suicide: హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పరిధిలోని విజయనగర్ కాలనీలో సతీష్ కుమార్ తన భార్య, కుమారుడు నితిన్ కుమార్, కుమార్తె శ్రీజావలితో కలిసి నివసిస్తున్నారు. సతీష్ కుమార్ కుటుంబం కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అప్పుల భారం పెరిగిపోవడంతో పాటు, కుటుంబ పోషణ భారంగా మారడం, ఇతర వ్యక్తిగత సమస్యల వల్ల ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనే విచారకరమైన నిర్ణయానికి వచ్చారు.
అయితే సతీష్ కుమార్ కుమార్తె శ్రీజావలి పుట్టుకతోనే దివ్యాంగురాలు. తాము చనిపోతే ఆమెను చూసుకునే వారు ఎవరూ ఉండరనే ఆవేదనతో, తల్లిదండ్రులు ముందుగా కుమార్తెను హతమార్చారు. అనంతరం సతీష్ కుమార్, అతని భార్య, కుమారుడు నితిన్ కుమార్ ముగ్గురూ తమ చేతులు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే, ప్రాణాలు తీసుకోవాలనే ప్రయత్నం చేసినా ఫలితం దక్కకపోవడంతో దాదాపు 48 గంటల పాటు వారు రక్తపు మడుగులో, నరకయాతన అనుభవిస్తూ అదే ఇంట్లో గడిపారు.
అయితే రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడినా ప్రాణాలు పోకపోవడం, విపరీతమైన నొప్పి, నిస్సహాయతతో కుమారుడు నితిన్ కుమార్ తన స్నేహితుడు భాస్కర్కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. తాము తీసుకున్న నిర్ణయం గురించి, ఇంట్లో ఉన్న పరిస్థితి గురించి వివరించడంతో దిగ్భ్రాంతికి గురైన భాస్కర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న ముగ్గురిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Also Read: నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీ కొన్న బస్సు.. స్పాట్లో 36 మంది
ఈ ఘటనలో శ్రీజావలి అప్పటికే మరణించడంతో, పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ కుమార్, అతని భార్య, కుమారుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. జగద్గిరిగుట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అప్పుల బాధే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమా లేక మరేవైనా ఇతర కోణాలు ఉన్నాయా అనే దిశగా విచారణ చేపడుతున్నారు.