Konaseema Tragedy: కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరంలోని బాణసంచా పరిశ్రమలో పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కోనసీమ జిల్లా రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీపావళి సందర్భంగా భారీగా పటాకులు తయారుచేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగి ఒక్కసారి భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. ఈ విషాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఫైర్ వర్క్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద స్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 40 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ పేలుడు ధాటికి బాణసంచా తయారీ కేంద్రం షెడ్డు గోడ కూలిపోయింది. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్రమాదస్థలిని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు.
ఈ ప్రమాదంపై కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్కుమార్ స్పందించారు. వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారన్నారు. అగ్నిప్రమాద నివారణ పరికరాలను గోడౌన్ లో సక్రమంగా వినియోగించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని చెప్పారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని సీఎం అన్నారు. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడానని చెప్పారు. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
Also Read: Lift Collapse: విషాదం.. లిఫ్ట్ కూలి నలుగురు కార్మికులు మృతి
ఈ ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో అనిత మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు.