జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2021లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. భూవివాదాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత పాశవికంగా హతమార్చిన 9 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం వెలువడిన ఈ తీర్పు స్థానికంగా కలకలం రేపింది.
కాటారం మండలం గంగారం గ్రామంలో 2021లో ఈ ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన మంజనాయక్, ఆయన కుమారులు సారయ్య, భాస్కర్లకు అదే గ్రామానికి చెందిన కొందరితో భూమి విషయంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాధితులను అంతమొందించాలని పథకం పన్నిన నిందితులు, వారిపై దాడికి దిగారు. బాధితుల కంట్లో కారం కొట్టి, వారు తేరుకోకముందే గొడ్డళ్లతో నరికి కిరాతకంగా చంపారు. ఒకే కుటుంబంలో తండ్రి, ఇద్దరు కొడుకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాటారం పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి జిల్లా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున బలమైన సాక్ష్యాలను న్యాయస్థానం ముందు ఉంచారు.
సుమారు నాలుగేళ్ల పాటు సాగిన విచారణలో ఉభయ పక్షాల వాదనలు విన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి, నేరం రుజువు కావడంతో 9 మంది నిందితులను దోషులుగా నిర్ధారించారు. సమాజంలో ఇటువంటి హింసాత్మక చర్యలకు తావులేదని పేర్కొంటూ, నిందితులకు జీవితకాలం జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
ఈ తీర్పు పట్ల బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగడానికి సమయం పట్టినప్పటికీ, దోషులకు కఠిన శిక్ష పడటం పట్ల పోలీసు వ్యవస్థకు, న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నిందితులకు జీవిత ఖైదు పడటం ద్వారా భూతగాదాలు, గొడవలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లయిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Top 20 News: రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి, ఆర్టీసీ బస్సులో 15 తులాల బంగారం చోరీ