Karnataka Crime: ఊహించని ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. భార్యని నడిరోడ్డుపై దారుణంగా చితకబాదాడు ఆమె భర్త. ఆ తర్వాత కారు నుంచి బయటకు తోసి గొంతు కోశాడు. చివరకు ఆమె పైనుంచి వాహనాన్ని పోనిచ్చాడు. సభ్య సమాజం తలదించుకునే ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
కర్ణాటకలో దారుణమైన ఘటన.. భార్యని నడిరోడ్డు కొట్టి
పోలీసుల వివరాల మేరకు కర్ణాటకలోని గంగపుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గురువారం ఉదయం అక్షయ్-శైలజ ఇద్దరు కలిసి గంగాపుర పుణ్యక్షేత్రానికి మారుతి సుజుకి ఎర్టిగాలో వెళ్లారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో బల్లూర్గ గ్రామం సమీపంలో కారులో ఏం జరిగిందో తెలీదు. ఆ దంపతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పట్టరాని కోపంతో అక్షయ్.. భార్య శైలజను వాహనం నుండి బయటకు తోసేశాడు. అంతటితో ఆగకుండా ఆగ్రహంతో ఊగిపోయిన అక్షయ్.. కారును రోడ్డు పక్కన ఆపాడు. ఆ తర్వాత నడిరోడ్డుపై భార్యపై చేయి చేసుకున్నాడు. శైలజ ఎంత వేడుకున్నా ఏ మాత్రం కనికరం లేదు. ఆమె జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోశాడు. రోడ్డుపై సాయం కోసం ఆమె ఆ దారి వెంట వెళ్లినవారిని ప్రాధేయపడింది.
కారు నుంచి బయటకు తోసి, ఆపై గొంతు కోశాడు.. చివరకు
ఆమెపై నుంచి ఎస్యూవీ కారుని వేగంగా పోనిచ్చాడు. కారు చక్రాల కింద నలిగిపోవడంతో బాధితురాలికి రక్తస్రావం అయ్యింది. ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలింది. ఈ దారుణాన్ని కళ్లతో చూసిన స్థానిక ప్రాంతంవారు భయంతో వణికిపోయారు. ఈ ఘటనను రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, పాదచారులు చూసి షాకయ్యారు. ఈ ఘటన గురించి స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు పోలీసులు.
వెంటనే అక్కడికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత అక్షయ్ అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. ఈ ఘటన గురించి స్థానికుల నుంచి మరింత సమాచారం సేకరించారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు, అతడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
ALSO READ: పండుగ వేళ ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం
కుటుంబ కలహాలు ఈ ఘటనకు ప్రధాన కారణమై ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ విషయం తెలియగానే మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను ఆధారంగా విచారణ చేస్తున్నారు.