Mancherial Road Accident: మంచిర్యాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం ఎక్స్రోడ్ సమీపంలో రోడ్డుపక్కన ఆగి ఉన్న బులారో వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల వెళ్తే.. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో బులారో వాహనం కరీంనగర్ వైపు ప్రయాణిస్తోంది. ప్రయాణం మధ్యలో డ్రైవర్ బహిర్భూమికి వెళ్లేందుకు ఇందారం ఎక్స్రోడ్ వద్ద వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ వేగంగా వచ్చి బులారోను ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన క్షణాల్లోనే వాహనంలో ఉన్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న మంచిర్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అంబులెన్స్ల సహాయంతో క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి రహదారి పునరుద్ధరించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొన్న బస్సు.. స్పాట్లో 15 మంది మృతి, అర్ధరాత్రి తర్వాత ఘటన
ప్రాథమికంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు, గాయపడిన వారు మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు. పనుల నిమిత్తం కరీంనగర్కు వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.