Cyber Fraud: ఈమధ్య కాలంలో సైబర్ కేటుగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఆధునిక టెక్నాలజీని వాడి అమాయకులను మోసగించడంలో ఈ గ్యాంగులు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారో ఈ సంఘటన మరోసారి చూపించింది. ఓ మహిళా వైద్యురాలి మొబైల్ ఫోన్ను హ్యాక్ చేసి డబ్బులు దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డాక్టర్ ఫోన్లో కొన్ని చిన్న గ్లిచ్లు కనిపించాయి. కొన్ని యాప్లు ఓపెన్ కాకపోవడం, స్క్రీన్ ఫ్రీజ్ అవడం, మెసేజ్లు ఆటోమేటిక్గా ఓపెన్ అవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఆ డాక్టర్ పట్టించుకోలేదు. ఇదే సమయంలో సైబర్ కేటుగాళ్లు ఆమె ఫోన్పై పూర్తిగా నియంత్రణ సాధించారు. ఫోన్లోని కాంటాక్ట్ల జాబితాను, వాట్సాప్ చాట్లను, మెసేజ్ సిస్టంను ఒకేసారి యాక్సెస్ చేశారు.
ఫోన్ పూర్తిగా హ్యాక్ చేసిన తర్వాత, కేటుగాళ్లు వారి అసలు దందాను మొదలుపెట్టారు. డాక్టర్ పేరుతోనే ఆమె సన్నిహితులకు వరుసగా.. నా యూపీఐ పని చేయట్లేదు. చాలా అర్జెంట్ అవసరం ఉంది. వెంటనే రూ.65 వేలు పంపించండి అంటూ మెసేజులు పంపారు.
ఈ మెసేజ్ను ఒకరి కాదు.. పది మందికి పైగా పంపించారు. ఫోన్ నెంబర్, వాట్సాప్ డీపీ, అన్నీ చూసి ఎవరూ అనుమానం పడలేదు. నిజంగా ఆమెకో అవసరం వచ్చిందని భావించి చాలామంది వెంటనే డబ్బులను ఇచ్చిన UPI IDలకు ట్రాన్స్ఫర్ చేశారు. కొంతమంది చిన్న మొత్తాలు, మరికొందరు పెద్ద మొత్తాలు పంపడంతో కలిపితే మొత్తం దాదాపు రూ.6 లక్షలు వారి ఖాతాలకు చేరాయి.
మధ్యాహ్నం తర్వాత ఒకరి తర్వాత ఒకరు బంధువుల నుంచి డాక్టర్కు ఫోన్లు రావడం స్టార్ట్ అయింది. మేము పంపిన డబ్బులు వచ్చాయా?
అర్జెంట్ పని అయ్యిందా? అని అడగడం ఆమెను ఆశ్చర్యం కలిగించింది. తాను ఎవరికీ డబ్బులు అడగలేదని చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు. వెంటనే ఆమె తన ఫోన్లో చాట్స్ చెక్ చేయగా, తన పేరుతో పంపిన డజన్ల కొద్దీ మెసేజ్లు కనిపించాయి. అప్పటికే మోసం జరిగిపోయిందని అర్థమైంది.
దగ్గరలోని మంగళగిరి పోలీసు స్టేషన్కు వెళ్లి డాక్టర్ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే సైబర్ టీంను రంగంలోకి దించారు. డబ్బులు వెళ్లిన UPI ఖాతాలు, బ్యాంక్ లావాదేవీల వివరాలు, లింక్ అయిన మొబైల్ నంబర్లు, IP అడ్రెసులు అన్ని పోలీసులు సేకరించారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్లో ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల డాక్టర్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన ఒక అనుమానాస్పద యాప్ ద్వారా రిమోట్ యాక్సెస్ వెళ్లి ఉండొచ్చు. ఫిషింగ్ లింక్ను అనుకోకుండా ఓపెన్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి డబ్బులు వెళ్లిన UPI ఖాతాలు, IP అడ్రెస్లు, ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.