మెదక్ జిల్లా నార్సింగి మండలంలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాతకక్షలు పెంచుకున్న ఒక వ్యక్తి పక్కా ప్లాన్తో వేసిన ఉచ్చుకు ఓ అమాయక ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి ఇరుగుపొరుగున నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో పాతకక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని అంతమొందించాలని భూపాల్ రెడ్డి క్రూరమైన పథకం రచించాడు.
సాధారణంగా బట్టలు ఆరేసే తీగను ఎవరూ అనుమానించరు. దీనినే ఆయుధంగా మార్చుకున్న నిందితుడు.. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు తాకగానే ప్రాణాలు పోయేలా ఆ తీగకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. పగతో రగిలిపోతూ అతను చేసిన ఈ పని చివరకు ఒక అతిథి ప్రాణాలను తీసింది. మేడ్చల్ జిల్లాకు చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ నెల 7వ తేదీన సుధాకర్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు నార్సింగి వచ్చాడు.
ఈ నెల 8వ తేదీ ఉదయం శ్యామ్ సుందర్ రెడ్డి స్నానం ముగించుకుని తన బట్టలను ఆరేయడానికి బయటకు వచ్చాడు. దురదృష్టవశాత్తూ నిందితుడు భూపాల్ రెడ్డి కరెంట్ షాక్ పెట్టిన తీగపై బట్టలు వేయబోయాడు. ఆ తీగకు ఉన్న విద్యుత్ ప్రవాహం వల్ల ఒక్కసారిగా తీవ్రమైన షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలైన శ్యామ్ సుందర్ రెడ్డిని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే అతను ప్రాణాలు విడిచాడు.
తొలుత ఈ ఘటనను అందరూ ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్ షాక్గా భావించారు. అయితే తన పొరుగున ఉన్న భూపాల్ రెడ్డి ప్రవర్తనపై సుధాకర్ రెడ్డికి అనుమానం కలిగింది. గతంలో ఉన్న గొడవల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. పోలీసులు తమదైన శైలిలో భూపాల్ రెడ్డిని విచారించగా తాను చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశంతోనే కరెంట్ తీగ అమర్చానని.. కానీ తెలియక వచ్చిన బంధువు మరణించాడని ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుభకార్యం కోసం వచ్చిన వ్యక్తి శవమై తిరిగి వెళ్లడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ALSO READ: Kumari Aunty: కుమారి ఆంటీ స్టాల్కు గ్యాస్ కష్టాలు.. వంట తగ్గిందంటూ ఆవేదన, ఇదిగో వీడియో