మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బొగ్గుగనిలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 16 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. గని లోపల బొగ్గు తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.
ప్రమాదం జరిగిన సమయంలో గనిలో సుమారు 20 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి గని పైభాగం కుప్పకూలడంతో కూలీలు లోపల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో అత్యధికులు పొరుగు రాష్ట్రమైన అస్సాంకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మరికొందరు లోపల చిక్కుకుని ఉండే అవకాశం ఉండటంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదం జరిగిన గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మేఘాలయలో గత కొన్నేళ్లుగా నిషేధిత ర్యాట్ హోల్ మైనింగ్ (Rat-hole Mining) పద్ధతిలో తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు పదార్థాల వినియోగంలో అజాగ్రత్త వల్లే ఈ ఘోరం జరిగిందా? లేక గనిలో పేరుకుపోయిన మిథేన్ గ్యాస్ వల్ల ప్రమాదం సంభవించిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మేఘాలయలో అశాస్త్రీయంగా సాగుతున్న ర్యాట్ హోల్ మైనింగ్ను 2014లోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) నిషేధించింది. ఈ పద్ధతిలో భూమి లోపలికి కేవలం మూడు నుండి నాలుగు అడుగుల వెడల్పుతో ఇరుకైన గుంతలను తవ్వుతారు. కేవలం ఒక మనిషి మాత్రమే లోపలికి వెళ్లగలిగే ఈ రంధ్రాల ద్వారా బొగ్గును వెలికితీస్తారు. ఈ పద్ధతి అత్యంత ప్రమాదకరమైనది కావడంతో ఎన్జీటీ దీనిపై నిషేధం విధించింది. తదనంతరం సుప్రీంకోర్టు కూడా ఈ నిషేధాన్ని సమర్థించింది. అయినప్పటికీ, మారుమూల ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి అక్రమ తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నిషేధాలు ఉన్నప్పటికీ, పర్యవేక్షణ లోపం, మైనింగ్ మాఫియా ఆగడాల వల్ల అమాయక కూలీలు బలి అవుతున్నారు. ఈ ఘటనపై మేఘాలయ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
స్పందించిన ప్రధాని మోదీ..
మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు ఆర్థిక భరోసాగా, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాని హామీ ఇచ్చారు.
ALSO READ: Bhatti Vikramarka: ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించడం దారుణం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క