మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) నుంచి గాంధీజీ పేరును తొలగించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం సాయంత్రం చెన్నైలో తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఉపాధి హామీ నిబంధనల్లో మార్పులు చేయడం, పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘మహాత్మా గాంధీ ఏం పాపం చేశారని ఉపాధి పథకం నుంచి ఆయన పేరును తొలగించారు? ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, వ్యవసాయ కార్మికుల హక్కులను కాలరాయడమే. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ఈ పథకం ఆత్మను చంపేసింది’ అని ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గాంధీజీ పేరుతో తెచ్చిన ఈ పథకం గ్రామీణ భారతం పాలిట ఒక నిశ్శబ్ద విప్లవం అని ఆయన అభివర్ణించారు.
గతంలో కూలీ ధరల పెంపు కోసం కార్మికులు లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించాల్సి వచ్చేదని.. కానీ ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజుల పనిని హక్కుగా కల్పించి, కార్మికులు తమ ఊర్లోనే ఆత్మగౌరవంతో బతికేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని గుర్తుచేశారు. అటువంటి గొప్ప పథకాన్ని కనుమరుగు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పిలుపు మేరకు, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలో పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ శ్రేణులు అలుపెరగని పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు.
చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ.. ‘బలమైన బ్రిటిష్ సామ్రాజ్యం కూడా గాంధీజీని ముట్టుకోవడానికి భయపడింది. కానీ దురదృష్టవశాత్తు దేశంలోని మతతత్వ శక్తులే ఆయన్ని కాల్చి చంపాయి. నేడు అదే శక్తులు ఆయన పేరును పథకాల నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని భట్టి విమర్శించారు. గాంధీజీ అందించిన స్వేచ్ఛను, పెరియార్ ఇచ్చిన ఆత్మగౌరవాన్ని కాపాడుతూ భావి తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సభలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై, ఏఐసీసీ కార్యదర్శి చోలాంకర్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Jangaon Municipality: బీఆర్ఎస్ ఛైర్మన్ల చేతివాటం.. జనగామలో నిధుల గోల్ మాల్? ఆర్టీఐతో వెలుగులోకి..!