Kamareddy Theft Case: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఒక వింతైన దొంగతనం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సాధారణంగా బీరువాలోని నగదు, నగలు ఎత్తుకెళ్లే దొంగలను చూస్తుంటాం, కానీ ఇక్కడ ఏకంగా బీరువానే మోసుకెళ్లడం గమనార్హం. బాధితురాలు శమీమున్నీసా బేగం తన ఇంటికి తాళం వేసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగులు పక్కా పథకం ప్రకారమే ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు, ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా తాళాలు తీయడానికి సమయం పడుతుందనో లేదా లోపల భారీగా సొత్తు ఉంటుందనే ఉద్దేశంతోనో గానీ, ఏకంగా బీరువాను బయటకు తరలించుకుపోయారు. అందులో సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులు ‘100’కు కాల్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది, ప్రాథమిక ఆధారాలను సేకరించారు. క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు వినాయక్ నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. బీరువాను తరలించడానికి దొంగలు ఏదైనా వాహనాన్ని ఉపయోగించారా? లేక ఎంతమంది ఈ ముఠాలో ఉన్నారు? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: ప్రియురాలిని చంపి.. ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు! ఇండొర్ లో దారుణం..
ఈ ఘటనతో పట్టణంలోని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు పడుతుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. త్వరలోనే నిందితులను పట్టుకుని సొత్తును రికవరీ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.