Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వెల్దండ మండలం రాగాయపల్లి స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ నుంచి అచ్చంపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న కారును రాగాయపల్లి వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న వారు లోపలే చిక్కుకుపోవడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా శ్రీశైలం హైవేపై కొంత సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: నరసాపురం కాలవలో విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్థిని గల్లంతు!