Nalgonda drugs: ఒడిశా నుంచి మహారాష్ట్రకు భారీగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో నల్గొండ ఎక్సైజ్ అధికారులు పం తంగి టోల్గేట్ వద్ద నిఘా పెట్టారు. రామన్నపేట సీఐ బాలోజీ నాయక్, మోత్కూర్ సీఐ రవిచంద్ర రెడ్డి నేతృత్వంలోని బృందం తనిఖీలు చేపట్టగా.. ఆటోలో రహస్యంగా తరలిస్తున్న 60.685 కిలోల గంజాయి బయటపడింది. పోలీసుల కళ్లు గప్పేందుకు నిందితులు మహిళలను వెంటబెట్టుకుని ప్రయాణించడం గమనార్హం. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన గంగూభాయ్ పాండురంగ చౌహార్, కమల్ అర్జున్ మోతెతో పాటు నల్గొండకు చెందిన దాసు వేణుకుమార్ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 33 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయిదేళ్ల తర్వాత చిక్కిన డ్రగ్ పెడ్లర్
మరో కేసులో.. గత ఐదేళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ ఉల్లంగి వెంకటేశ్ను మల్కాజిగిరి డీటీఎఫ్ అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్లోని పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుండి హాష్ ఆయిల్ను సేకరించి హైదరాబాద్లో విక్రయిస్తుంటాడు. నారపల్లి అటవీ ప్రాంతంలో మాటు వేసిన సీఐ భరత్ భూషణ్ బృందం నిందితుడిని పట్టుకుని అతని వద్ద నుంచి 5 లక్షల విలువైన 1.04 కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల అభినందనలు
ఈ ఆపరేషన్లలో ప్రతిభ కనబరిచిన సీఐలు శంకర్, శివకృష్ణ, సత్యనారాయణ , ఇతర కానిస్టేబుళ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షా నవాజ్ ఖాసీం, మల్కాజిగిరి సూపరింటెండెంట్ నవీన్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.