Nalgonda Tragedy: కొడుక్కి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్లింది ఓ మహిళ. ఆసుపత్రిలో ఇచ్చిన టాబ్లెట్ వేశాక.. నీళ్లు కోసం చూసింది. పక్కనే ఉన్న ఓ ల్యాబ్ లో ఉన్న రసాయనాన్ని నీళ్లనుకుని కొడుక్కి ఇచ్చింది. రెండు గుటకలు తాగగానే.. కుమారుడు కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది.
అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన సండ్ర సత్యనారాయణ, రామలింగమ్మకు కుమార్తె, కుమారుడు ఇద్దరు సంతానం. కుమారుడు గణేశ్(19) హైదరాబాద్లోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కొన్ని రోజులుగా గణేశ్ కు ఆరోగ్యం బాగాలేకపోవడం ఇంటికి వచ్చాడు. రామలింగమ్మ కొడుకుని శనివారం ఉదయం మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. గణేశ్ కు తీవ్ర జ్వరం రావడంతో ముందుగా పారాసిటమాల్ టాబ్లెట్ వేయాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు.
కుమారుడికి టాబ్లెట్ వేసేందుకు మంచినీళ్ల కోసం చూసింది రామలింగమ్మ. అయితే ఆసుపత్రిలోని నీళ్ల క్యాన్ లో వాటర్ లేకవడంతో.. మంచి నీళ్ల కోసం వెతుకుతూ.. పక్కనే ఉన్న ల్యాబ్ లోకి వెళ్లింది. అక్కడ క్యానులో ఉన్న ఫార్మాల్డిహైడ్ రసాయనాన్ని తాగునీరే అనుకుని బాటిల్లో నింపి తీసుకొచ్చి కుమారుడికి ఇచ్చింది. టాబ్లెట్ వేసుకుని రెండు గుటకలు తాగగానే.. గణేశ్ తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయాడు. వైద్యులు పరీక్షించి యువకుడు మృతి చెందినట్లు తెలిపారు.
Also Read: Two Autos Collided: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ.. స్పాట్లో ఎనిమిది మంది, ఇంతకీ ఎక్కడ?
ఆసుపత్రిలో తాగునీరు లేకపోవడం, ప్రమాదకర రసాయనాన్ని నిర్లక్ష్యంగా ల్యాబ్ లో వదిలేయడం వల్లే గణేశ్ మృతిచెందాడని అతడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని బాధిత బంధువులకు సర్దిచెప్పారు. గణేశ్ తండ్రి ఫిర్యాదుతో ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.