Road Accident: మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నర్సాపూర్ పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ నుంచి గోవాకు మూడు కార్లలో మొత్తం 15 మంది స్నేహితులు కలిసి ఈ ట్రిప్కు వెళ్లారు. కొన్ని రోజులుగా గోవాలో విహారయాత్రను సంతోషంగా గడిపిన వీరు, తిరుగు ప్రయాణంలో మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉన్న కార్లలో ఒక కారు అతివేగంతో దూసుకెళ్తుండగా, అకస్మాత్తుగా కారు టైర్ బోల్తా పడినట్లు తెలుస్తోంది.
ఈ కారు ప్రమాద సమయంలో నలుగురు యువకులు ఉన్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన కారును తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టైర్ పేలడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.