Khammam Road Accident: సరదాగా గడుపుదామని విహారయాత్రకు వెళ్లిన ఆ స్నేహితులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. దైవ దర్శనం చేసుకుని, సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదం ఐదు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. జనగామ జిల్లాకు చెందిన నలుగురు యువకులు ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది.
జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన బాలకృష్ణ, అనిల్ మరియు స్టేషన్ ఘన్పూర్కు చెందిన క్రాంతి, రాకేష్, అజయ్.. ఈ ఐదుగురు ప్రాణ స్నేహితులు. నాలుగు రోజుల క్రితం వీరంతా కలిసి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ సందర్శన కోసం కారులో విహారయాత్రకు బయలుదేరారు. యాత్ర ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా సోమవారం ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో వీరి కారును ఓ లారీ బలంగా ఢీకొట్టింది.
లారీ ఢీకొట్టిన ధాటికి కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఉప్పుగల్లుకు చెందిన బాలకృష్ణ, అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కారులో ఇరుక్కున్న వారిని స్థానికులు, పోలీసులు అతికష్టమ్మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన రాకేష్, క్రాంతిలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారిద్దరూ కూడా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో స్నేహితుడు అజయ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న పిల్లలు విగతజీవులుగా మారుతుండటంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఒకేసారి నలుగురు స్నేహితులు మృత్యువాత పడటంతో ఉప్పుగల్లు, స్టేషన్ ఘన్పూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేక నిద్రమత్తులో జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Read Also: Chinese Manja: సంక్రాంతి రాకముందే మృత్యుఘంటికలు.. చైనా మాంజాతో ఇద్దరి గొంతు కోత!