నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆత్మకూరు మండలం బోయిల సిరివెళ్ల గ్రామానికి చెందిన చావల మాధవ, భార్య మనోజిని బైక్పై ఆత్మకూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో, కడప నుంచి నెల్లూరు వైపు వేగంగా వస్తున్న ఇన్నోవా కారు వారి బైక్ను అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ధాటికి దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఎస్సై జిలాని తన సిబ్బందితో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జిలాని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మరణించడంతో బోయిల సిరివెళ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.