Nellore CPM Leader Murder: నెల్లూరులో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. తమ ఆగడాలకు అడ్డుపడుతున్నాడనే కారణంగా స్థానిక సీపీఎం నేత పెంచలయ్యను అత్యంత దారుణంగా హత్య చేశారు. కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో తొమ్మిది మంది వేటాడి వెంటాడి పెంచలయ్యను కిరాతకంగా హతమార్చారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద జరిగిన ఈ మర్డర్ తీవ్ర కలకలం రేపుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు వెళ్లగా.. గంజాయి బ్యాచ్ పోలీసులపై ఎదురుదాడి చేసింది. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో నిందితుల్లో ఒకరి మోకాలికి గాయమైంది.
నెల్లూరులో ఇటీవల గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. కల్లూరిపల్లి ఆర్డీటీ కాలనీ గంజాయికి అడ్డాగా మారింది. సీపీఎం కార్యకర్త పెంచలయ్య గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా పోలీసులతో కలిసి అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వ్యవహారం గంజాయి బ్యాచ్ కు నచ్చకపోవడం.. పెంచలయ్యను హతమార్చాలని ప్లాన్ వేశారు. గంజాయి సప్లైర్ గా ఉన్న ఓ మహిళ పెంచలయ్యను చంపేందుకు రెక్కీ చేసింది. శుక్రవారం తన కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో 9 మంది గంజాయి బ్యాచ్ కాపు కాసింది. ఒక్కసారిగా పెంచలయ్యపై కత్తులతో దాడికి పాల్పడింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన పెంచలయ్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే పెంచలయ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read: Childrens Death: తీవ్ర జ్వరంతో గంటల వ్యవధిలో.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చిన్నారులు మృతి
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి బ్యాచ్ ఈ దారుణానికి పాల్పడిందని ప్రకటించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టగా శనివారం తెల్లవారుజామున కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారని సమాచారం వచ్చి అక్కడికి వెళ్లారు. జేమ్స్ అనే నిందితుడు అక్కడ కనిపించడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అతడు పోలీసులపై కత్తితో దాడి చేయగా ఆదినారాయణ అనే కానిస్టేబుల్ గాయపడ్డాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేమ్స్ మోకాలికి గాయంకాగా.. మిగిలిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన జేమ్స్ తో పాటు కానిస్టేబుల్ ఆదినారాయణను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసుల గాలింపు తీవ్రం చేశారు.