Road Accident: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, రాముడుపాలెం వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టైరు కింద పడి ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల పులి కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
అయితే ఈ ఘటనలో సైకిల్పై ప్రయాణిస్తున్న ఆ ఇద్దరు అన్నదమ్ములలో సైకిల్ ముందువైపు తొక్కుతున్న తమ్ముడు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో.. ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, సైకిల్ వెనుక వైపు కూర్చున్న అన్న కిరణ్ (11) మాత్రం బస్సు చక్రాల కింద పడి దుర్మరణం చెందాడు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలో అన్నదమ్ముల్లో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడటం కుటుంబ సభ్యులకు తీరని బాధను మిగిల్చింది. అంతేకాకుండా గతంలోనే ఈ చిన్నారుల తండ్రి పులి మురళి కరెంట్ షాక్తో మరణించాడు. ఒకే కుటుంబంలో వరుసగా రెండు విషాదాలు జరిగాయి. దీంతో వారి కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సైకిల్పై వస్తున్న బాలురను బస్సు డ్రైవర్ గమనించకపోవడం లేదా అతివేగం కారణంగా బస్సు అదుపు తప్పడం వలన ఈ ఘోరం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపివేశాడు, అయితే అప్పటికే తీవ్ర గాయం కావడంతో బాలుడు కిరణ్ను కాపాడలేకపోయారు.
Also Read: పంచాయితీ ఎన్నికల వేళ హీటెక్కిన పల్లెలు.. రంగంలోకి నేతల అనుచరులు
స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆరా తీసి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.