Elections Fight: తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో జరగబోతున్న సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పల్లె రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో, అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు అధికారికంగా పార్టీ గుర్తులతో జరగనప్పటికీ, తమకు మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీల అగ్రనేతలు సైతం ప్రచారంలోకి దూకారు. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్రనేతల మధ్య చోటు చేసుకుంటున్న విమర్శలు, ప్రతి విమర్శలతో గ్రామీణ రాజకీయం సెగలు కక్కుతోంది.
రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తనదైన శైలిలో కమలాపూర్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నేత పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ, “చచ్చిపోతాం అని కొంగుపట్టి ఓట్లు అడిగితే, నిజంగానే చచ్చిపోతారేమో అని మహిళలంతా కరిగిపోయి ఓట్లేస్తే, ఆ తర్వాత ఏం చేశారో ఇప్పుడు చూస్తున్నాం” అంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈటల రాజేందర్ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. ఈటల రాజేందర్ది మొదటి నుంచీ మోసపూరిత చరిత్ర అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్నే వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించారని మండిపడ్డారు. ఈటల నిస్వార్థ సేవకుడిలా నటిస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య విమర్శల యుద్ధం కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేడి మరింత పెరిగింది.
అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పంచాయతీ ఎన్నికల ప్రచారం మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య వ్యక్తిగత రాజకీయ వైరంలా మారింది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ అజయ్ మాట్లాడుతూ, అవకాశం కోసం పార్టీలు మారిన తుమ్మల నాగేశ్వరరావు చివరకు తనను కూడా మోసం చేశారని ఆరోపించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకును అడ్డుపెట్టుకుని పరిపాలన చేస్తున్నారని పువ్వాడ అజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. “తుమ్మలకు ఓటేసిన ప్రజల వద్దకు నేరుగా వచ్చే సమయం లేదని, అందుకే తన కొడుకును పెట్టుకుని పరిపాలన చేస్తున్నారని” ఆయన ఆరోపించారు. తమ అనుచరుల గెలుపు కోసం ఖమ్మంలో మంత్రి, మాజీ మంత్రి ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ విమర్శలు స్థానిక ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
Also Read: హైదరాబాద్లో అక్కడ ఒక్క రూపాయికే టిఫిన్.. మెనూ ఏంటో తెలిస్తే షాక్!
మొత్తం మీద, తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న పంచాయితీ ఫైట్ పీక్ స్టేజ్కు చేరుకుంది. గ్రామాల్లో తమ పార్టీ మద్దతు దారులను గెలిపించుకోవాలనే పట్టుదలతో అగ్రనేతలు రంగంలోకి దిగడం, ఎన్నికల ప్రచారాలను నిర్వహించడం, ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం వంటి పరిణామాలు గ్రామాల్లో ఎన్నికల సందడిని మరింత పెంచాయి. ఈ విమర్శల సెగలు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
పంచాయితీ ఎన్నికల వేళ హీటెక్కుతున్న పల్లె రాజకీయాలు
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో జోరుగా ఎన్నికల ప్రచారం
కార్యకర్తల గెలుపు కోసం రంగంలోకి దిగిన పార్టీ అగ్రనేతలు
విమర్శలు, ప్రతివిమర్శలతో దూసుకుపోతున్న లీడర్లు pic.twitter.com/9pwYYS3saJ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2025