Road Accident: ఇటీవలి కాలంలో రోజు వరుస రోడ్డు ప్రమాదాల కారణంగా బయటకు వెళ్లాలంటేనే బయటపడుతున్నారు వాహనదారులు.. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనగామకు చెందిన వట్టి నితిన్ రెడ్డి (28), సిజాహిద్ (22) అనే ఇద్దరు స్నేహితులు ద్విచక్రవాహనంపై హైదరాబాద్ నుండి తమ స్వస్థలానికి వస్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక కారు వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన యువకులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నిర్లక్ష్యమే కారణం
ఆలేరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం, కడ్తాల్ ప్రాంతానికి చెందిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో నితిన్, సిజాహిద్లు ఎగిరి కింద పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వట్టి బాల సుధాకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చితికిపోయిన కలలు
మృతుల్లో నితిన్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం త్వరలోనే అమెరికా వెళ్లాల్సి ఉండగా, ఈ లోపే మృత్యువు కబళించింది. ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో నితిన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరో మృతుడు సిజాహిద్ బొగ్గు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి లేని సిజాహిద్ను తల్లి కూలి పనులు చేస్తూ చదివించింది. చేతికి అందిన కొడుకు మరణించడంతో ఆ కుటుంబంలో తీరని చీకటి అలముకుంది.
Also Read: హైకోర్టు ఆదేశాలు.. గీతం యూనివర్సిటీ ఉక్కిరిబిక్కిరి! మేటరేంటి?
కుటుంబాలకు పరామర్శ
మృత్యువులోనూ వీడని వీరి స్నేహబంధం స్థానికులను కన్నీరు పెట్టించింది. గురువారం నాడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి, వారిని ఓదార్చారు. అకస్మాత్తుగా ఇద్దరు యువకులు మరణించడంతో జనగామలో విషాద ఛాయలు అలుముకున్నాయి.