Siddipet Crime: ఆస్తి మోజులో మానవ సంబంధాలు మసకబారుతున్నాయి. కట్టుకున్న భార్యకు జన్మనిచ్చిన తల్లి అని కూడా చూడకుండా, కేవలం భూమి కోసం ఓ అల్లుడు కిరాతకానికి ఒడిగట్టాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ (55) భర్త గతంలోనే మరణించడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వారిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. రాములమ్మ పేరుపై రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆరు నెలల క్రితం ఆమె తన భూమిని ఇద్దరు కూతుళ్లకు సమానంగా పంచుతానని చెప్పింది. అయితే, ఆ నిర్ణయం చిన్న అల్లుడు జీవన్ రెడ్డికి నచ్చలేదు. భూమి మొత్తం తనకే దక్కాలన్న దురాశతో అత్తపై కక్ష పెంచుకున్నాడు.
మంగళవారం మధ్యాహ్నం రాములమ్మ ఒంటరిగా ఉన్న సమయం చూసి, జీవన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి ఆమె ఇంటికి వచ్చాడు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా టవల్తో ఆమె గొంతు బిగించి, అరుపులు వినిపించకుండా నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇది దొంగతనంలా నమ్మించేందుకు ఆమె చెవి కమ్మలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
రాములమ్మ మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు జీవన్ రెడ్డి తన బట్టలు మార్చుకుని, ఏమీ తెలియనట్లు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అత్త శవంపై పడి దొంగ ఏడుపులు ఏడుస్తూ హైడ్రామా సృష్టించాడు. అయితే, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ ప్రాంతంలోని సిసి కెమెరాలను పరిశీలించగా.. జీవన్ రెడ్డి స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లడం, హత్య తర్వాత బయటకు రావడం రికార్డయ్యింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.
Read Also: ప్రియుడు మోజులో భర్తని లేపేసింది.. ఫోన్స్ ద్వారా, విశాఖలో దారుణమైన ఘటన