Sri Sathya Sai district: దారుణం.. అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యం చేసిన ఓ కామాంధుడు.. ఇటీవలి కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అఘాయిత్యాలు చాలా అవుతున్నాయి. తప్పు చేస్తే జైలుకు వెళతారు అని తెలిసినా కూడా ఆడపిల్లల వద్ద మృగాళ్లా ప్రవరిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆడపిల్లలను బయటకు పంపించాలంటేనే ఏ టైంలో ఏం జరుగుతుందో అని భయపడిపోతున్నారు. ఇదంతా ఎందుకంటే.. శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండలం నాగిరెడ్డిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల వయసున్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు మైనర్ బాలుడు.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలైన ఐదేళ్ల బాలిక తన ఇంటి ముందు ప్రశాంతంగా ఆడుకుంటున్న సమయంలో, అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడు ఆమెపై కన్నేశాడు. పసిపాప అనే కనికరం లేకుండా, చాక్లెట్ ఇస్తానంటూ ఆ చిన్నారిని నమ్మించి లోబరుచుకున్నాడు. ఎవరూ లేని సమయం చూసి తన ఇంటిలోకి తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మృగాడి చేతిలో నలిగిపోయిన పసిపాక, తీవ్ర రక్తస్రావం, శారీరక నొప్పితో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలుడి క్రూరత్వానికి ఆ చిన్నారి ప్రాణం విలవిలలాడింది.
చాలాసేపటి వరకు పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. చివరకు నిందితుడి ఇంట్లో స్పృహ లేకుండా పడి ఉన్న కూతురిని చూసి వారు షాక్కు గురయ్యారు. పాప పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: అక్కడ పోలింగ్ బహిష్కరణ.. ఆ జీవో ఇస్తేనే ఓటేస్తామన్న గ్రామస్తులు!
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. మైనర్ నిందితుడిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. నిందితుడు మైనర్ అయినప్పటికీ, అతను చేసిన నేరం అత్యంత ఘోరమైనది కావడంతో చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు ఉరిశిక్ష పడాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.