Congress Protest in Parliament: ఢిల్లీ పార్లమెంట్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఆవరణలోని మఖద్వారం వద్ద భారీ ధర్నా చేపట్టింది. “సత్యమేవ జయతే” అనే నినాదాలతో కాంగ్రెస్ ఎంపీలు, నేతలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ నిరసనకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేయాల్సిన దర్యాప్తు సంస్థలను తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఇన్కమ్ టాక్స్, ఎలక్షన్ కమిషన్ వంటి సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్రంగా వ్యవహరించాల్సినవని, కానీ ప్రస్తుతం అవన్నీ బీజేపీ రాజకీయ ఆయుధాలుగా మారాయని విమర్శించారు.
ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనే శక్తి లేకపోయిన బీజేపీ, రాజకీయంగా పోటీ ఇవ్వలేక ఇలాంటి కేసులు, దర్యాప్తుల పేరుతో ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ కేసును ఉదాహరణగా ప్రస్తావించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆధారాలు లేకుండా ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనుక బీజేపీ రాజకీయ కుట్ర దాగి ఉందని అన్నారు.
ఈ కేసును కోర్టు పరిశీలించి, సరైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేసిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం అదే కేసును మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకువచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
బీజేపీకి ప్రజల్లో మద్దతు తగ్గుతుండటంతో, రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. అందుకే ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి, అధికారంలో కొనసాగేందుకు ఇలాంటి రాజకీయ కుతంత్రాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను అణచివేయడం ద్వారా మాత్రమే తమ ఉనికిని కాపాడుకోవాలన్న దురుద్దేశమే బీజేపీ వ్యూహమని అన్నారు.
Also Read: పెంపుడు కుక్కలున్నాయా? పొరపాటున కరిస్తే ఓనర్పై ఎఫ్ఐఆర్, ఇదెక్కడి రూల్ బాబోయ్
పార్లమెంట్లో చేపట్టిన ఈ నిరసన ద్వారా బీజేపీ కుట్రలను.. ప్రజల ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యమని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు. స్వతంత్ర సంస్థల స్వేచ్ఛను కాపాడాలంటే బీజేపీ రాజకీయాలకు చెక్ పెట్టాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.