TCS Nashik Case: మహారాష్ట్ర నాసిక్ లోని టీసీఎస్ (TCS) బిపిఓ యూనిట్లో పోలీసులు నిర్వహించిన ‘సైలెంట్ ఆపరేషన్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కార్యాలయంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను రెడ్ హ్యాండెడ్ గా తెలుసుకునేందుకు పోలీసులు మారువేషాల్లో వెళ్లి మరి ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో వారికి సంచలన విషయాలు తెలిశాయి.
టీసీఎస్ నాసిక్ బ్రాంచ్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినుల పట్ల వేధింపులు జరుగుతున్నాయని, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు వరుస ఫిర్యాదులు అందాయి. అయితే సాక్ష్యాధారాలు సేకరించడం కోసం పోలీసులు నేరుగా కాకుండా రహస్యంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే నాసిక్ పోలీసులు దాదాపు ఒక నెల రోజుల పాటు ఆ కార్యాలయంలో రహస్యంగా గడిపారు. ఇందుకోసం కొందరు పోలీసులు హౌస్ కీపింగ్ (శుభ్రం చేసేవారు) సిబ్బందిగా, మరికొందరు పారిశుధ్య కార్మికులుగా మారువేషంలో ఆఫీసు లోపలికి వెళ్లారు. అక్కడ పని చేస్తున్న సమయంలో మహిళా ఉద్యోగినులతో కొందరు సీనియర్లు ఎలా ప్రవర్తిస్తున్నారు, మతపరమైన అంశాలపై ఎలా ఒత్తిడి తెస్తున్నారు అనే విషయాలను వారు ప్రత్యక్షంగా గమనించారు. కార్యాలయం లోపల జరుగుతున్న సంభాషణలు, వేధింపులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు నిశ్శబ్దంగా సేకరించారు.
నాసిక్ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా ఉద్యోగినులను కొందరు టీమ్ లీడర్లు, మేనేజర్లు లైంగికంగా వేధించినట్లు పోలీసులు నిర్ధారించారు. హిందూ మహిళా ఉద్యోగినులను ఇస్లాం మతంలోకి మారాలని, బుర్ఖా ధరించాలని, నమాజ్ చేయాలని కొందరు నిందితులు తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు కంపెనీలోని హ్యూమన్ రిసోర్సెస్ (HR)విభాగానికి ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోగా బాధితులనే భయపెట్టినట్లు తేలింది. అయితే ఈ విషయం బయటకు రాగానే హిందూ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సదరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు ఈ సైలెంట్ ఆపరేషన్ అనంతరం నాసిక్ పోలీసులు టీసీఎస్ కార్యాలయంపై భారీ ఎత్తున దాడులు చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు టీమ్ లీడర్లు (అందరూ మగవారే) కాగా ఒకరు మహిళా హెచ్ఆర్ మేనేజర్ ఉన్నారు. మహిళా ఉద్యోగులపై వేధింపులకు సంబంధించి ఇప్పటివరకూ దాదాపు 9 ఎఫ్ఐఆర్ లను నమోదు చేసినట్లు నాసిక్ పోలీసులు తెలియజేశారు. క్రైమ్ విభాగం ఏసీపీ సందీప్ మిట్కే నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT).. ప్రస్తుతం ఈ కేసును విచారణ చేస్తోంది.
Also Read: Cooking Cost: ఎల్పీజీ vs ఇండక్షన్ vs హైడ్రోజన్.. సామాన్యుల వంటగదికి.. ఏది బెస్ట్ ఛాయిస్?
నాసిక్ బ్రాంచ్ లో చోటుచేసుకున్న షాకింగ్ ఘటనలపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితులందరినీ వెంటనే సస్పెండ్ చేసినట్లు టీసీఎస్ ప్రకటించింది. దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అంతర్గతంగానూ ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు టీసీఎస్ ప్రకటించింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్తి సుబ్రమణియన్ నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతోందని టాటా సన్స్ ఛైర్మన్ స్పష్టం చేశారు.
Also Read: Jio vs Airtel: జియో రూ.339 ప్లాన్.. ఎయిర్టెల్ రూ.379 ప్లాన్.. రెండింటిలో ఏది బెస్ట్?